సాక్షి, తాడేపల్లి: స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉషశ్రీ చరణ్ బాధ్యతలు చేపట్టారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఉషశ్రీ చరణ్ మీడియాతో మాట్లాడుతూ.. 'ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ మహిళనైన నాకు మంత్రిగా అవకాశం కల్పించారు. ఎలాంటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా నాకు అవకాశం ఇచ్చారు. బీసీలను అందరూ ఓట్ బ్యాంక్లా చూశారు.
కానీ సీఎం జగన్ బీసీ, మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మహిళా పక్షపాత ప్రభుత్వంలో మంత్రిగా ఉండటం అదృష్టం. మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తాం. మహిళలకు ఇప్పటి వరకూ ఎవరూ ఇవ్వని 50శాతం రిజర్వేషన్ ఇచ్చారు. మహిళలకు ఇళ్లు, ఇళ్ల పట్టాలు, ఆసరా, చేయూత ఇచ్చారు. మహిళా సాధికారత అన్ని రంగాల్లోనూ సాధించేలా సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారు' అని మంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు.
చదవండి: (హోం శాఖ అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నా: తానేటి వనిత)