చంద్రబాబు వ్యూహం ప్రకారమే గన్నవరం అల్లర్లు 

24 Feb, 2023 04:15 IST|Sakshi

ఎమ్మెల్యే వంశీ మోహన్‌ 

విజయవాడ నుంచి గూండాలను ఇక్కడికి పంపారు 

టీడీపీ ఆఫీసుపై దాడి జరిగితే వెంటనే ఎందుకు ఫిర్యాదు చేయలేదు?

గన్నవరం:  ప్రశాంతంగా ఉన్న గన్నవరంలో జరిగిన అల్లర్ల వెనుక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్యూహం ఉందని స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ చెప్పారు. పట్టాభి నేతృత్వంలో సంఘ విద్రోహ శక్తులను ఇక్కడికి పంపించి అల్లర్లకు కారణమయ్యారని తెలిపారు. వంశీమోహన్‌ గురువారం గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. గన్నవరంలో గొడవలు సృష్టించిన వారిలో విజయవాడ ఈస్ట్, సెంట్రల్, వెస్ట్, పెనమలూరు నియోజకవర్గాలకు చెందిన  60 మంది వరకు టీడీపీ గూండాలు ఉన్నారని చెప్పారు.

వీరందరూ గన్నవరంలో విధ్వంసం  సృష్టించేందుకు ప్రయత్నించి విఫలం కావడంతో చంద్రబాబుకు, టీడీపీకి గట్టి షాక్‌ తగిలిందన్నారు. ఇక్కడ జరిగిన గొడవలకు సంబంధించి కేసుల నమోదుపై టీడీపీ, ఎల్లో మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తప్పు­పట్టారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగినట్లు చెబుతున్న ఆ పార్టీ నేతలు బుధవారం రాత్రి వరకు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు . ఎస్పీ జాషువా మీడియాతో మాట్లాడిన తర్వాత మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావును వెంట పెట్టుకుని వచ్చి ఫిర్యాదులు చేశారని తెలిపారు.

అధికారంలో ఉన్నప్పుడు కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌పై ఏమీ చేయలేని చంద్రబాబు ఇప్పుడు ప్రపంచం తలక్రిందులైనట్లు చెబుతుండటం సిగ్గుచేటన్నారు. లేస్తే మగాడిని కాదంటూ లోకేశ్‌ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. టీడీపీ లేదు, బొక్కా లేదన్న అచ్చెన్నాయుడు ఓ ఐపీఎస్‌ అధికారిణితో అసభ్యకరంగా ప్రవర్తించి చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారని చెప్పారు. అచ్చెన్నాయుడు ఇంకా మాట్లాడితే చిట్టా మొత్తం విప్పుతానని అన్నారు. గతేడాది కోవిడ్‌ కారణంగా ఐఎస్‌బీ ఒక సెమిస్టర్‌ రాయలేదని, దానిని పూర్తి చేసేందుకు మొహాలీ వెళ్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు