ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ
సాక్షి, విజయవాడ: మార్చి 8న వరల్డ్ ఉమెన్స్ డే సందర్భంగా వంద రోజుల కార్యాచరణ రూపొందించినట్లు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. ప్రతీ జిల్లాలో మహిళలకు చట్టాల పట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళలకు పెద్దపీట వేసిన ఏకైక సీఎం వైఎస్ జగనేనని తెలిపారు. మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, మహిళా చైతన్యం కోసం దిశ చట్టం తీసుకొచ్చామని పేర్కొన్నారు. మహిళల భద్రతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ధ్యేయమన్నారు. (చదవండి: ‘మహిళా మార్చ్ 100 డేస్’ ప్రారంభం)
ప్రపంచంలోనే మొదటిసారి...
కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ మహిళల కోసం వినూత్నంగా వంద రోజుల కార్యచరణ ప్రపంచంలోనే మొదటిసారి అని, మహిళా కమిషన్ నిర్ణయం మహిళల సాధికారతకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు మహిళలకు అందేలా చూస్తున్నామని ఆయన వెల్లడించారు. మహిళలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని జాయింట్ కలెక్టర్ మాధవీలత అన్నారు. మహిళలకు ఉపయోగపడే అవగాహన కార్యక్రమాలు చాలా జరగాలని జేసీ కోరారు.