రామతీర్థం ఆలయాన్ని పరిశీలించిన మంత్రులు

3 Jan, 2021 12:36 IST|Sakshi

సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం ఉదయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం చేరుకుని, కోదండ స్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు. విగ్రహ ధ్వంసం ఘటన గురించి అధికారులు, అర్చకుల దగ్గర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ.. రామతీర్థం ఘటన బాధాకరమని, దీన్ని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. బాబు హయాంలో ఆలయాలను కూల్చినప్పుడు దేవుడు గుర్తు లేడు, కానీ ఇప్పుడు బాబుకు దేవుడు గుర్తొచ్చాడని విమర్శించారు.

చంద్రబాబు ఆలయాలను కూల్చిన వ్యక్తి..
బాబు.. దేవాలయ ఆస్తులను తన బినామీలకు దారాదత్తం చేశారని చురకలు అంటించారు. మతాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆగ్రహించారు. అసలు బాబుకు దేవుడంటే నమ్మకముందా? అని సూటిగా ప్రశ్నించారు. ఆలయాలను కూల్చిన వ్యక్తి సాంప్రదాయాల గురించి మాట్లాడతారా? అని మండిపడ్డారు. బాబు పాపాలు చేశారు కాబట్టే వెంకటేశ్వర స్వామి ఓడించాడని వ్యాఖ్యానించారు. ఇక రామ తీర్థం ఘటనపై పోలీసుల విచారణ జరుగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లంపల్లి తెలిపారు. దేవుడి విగ్రహాలు ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని, ఈ ఘటన వెనక ఉన్నవారికి శిక్ష తప్పదని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.

దోషులను శిక్షించాలి
అంతకు ముందు విశాకు వెళ్లిన వెల్లంపల్లి అక్కడ విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వామి సరూపానందేంద్ర సరస్వతి స్వామిని కలిశారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర మాట్లాడుతూ.. దేవాలయాల్లో దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ఉపేక్షిస్తే దేవాదాయ శాఖ ప్రతిష్ట దిగజారుతుందన్నారు. రామతీర్థం ఘటనపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని కోరారు. నివేదిక సమర్పణకు కమిటీకి కాలపరిమితి విధించాలని సూచించారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.

రామతీర్ఠంలో అసలు ఏం జరిగిందంటే... 
రామతీర్థం ప్రధానాలయానికి సుమారు 500 మీటర్ల దూరంలో నీలాచలం కొండ మీద శ్రీ కోదండరామస్వామి ఆలయంలోని సీతారామలక్ష్మణుల విగ్రహాల్లో ఈ నెల 28 అర్ధరాత్రి కొందరు దుండగులు శ్రీరాముని విగ్రహాన్ని ద్వంసం చేశారు. సాధారణంగా రోజూ అక్కడకు పూజారి ఉదయం 8 గంటలకు వెళ్లి మధ్యాహ్నం 12కు వెనక్కి వచ్చేస్తారు. అప్పటి నుంచి ఎవ్వరూ ఉండరు. దీన్ని అదనుగా తీసుకున్న దుండగులు ఖండించిన శిరస్సును సీతమ్మ కొలనులో పడేశారు. (చదవండి: రాముడి విగ్రహ ధ్వంసం 'దేశం' మూకల పనే?)

చైర్మన్‌ పదవి నుంచి అశోక గజపతి తొలగింపు 
రామతీర్థం ఆలయంలో శ్రీరాముని విగ్రహ ధ్వంసం ఘటనకు వ్యవస్థాపక ధర్మకర్త హోదాలో రామతీర్థం ఆలయ చైర్మనుగా కొనసాగుతున్న కేంద్ర మాజీమంత్రి అశోక గజపతి రాజు నిర్లక్ష్యం కూడా కారణమని దేవదాయ శాఖ పేర్కొంది. సంఘటన జరిగి రోజులు గడుస్తున్నా, కనీసం ఆ ఆలయాన్ని ఆయన సందర్శించలేదు. సరికదా.. దానిపై సరైన రీతిలో స్పందించలేదు. దీంతో ఆయన్ను ఆ పదవి నుంచి తొలగిస్తూ దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. దీనికితోడు విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం, తూర్పు గోదావరి జిల్లా మందపల్లిలోని మందేశ్వరస్వామి ఆలయం చైర్మన్‌ పదవుల నుంచి కూడా అశోక గజపతిరాజును తొలగించారు. (చదవండి: అయ్యో... రామ‘చంద్ర’!)

>
మరిన్ని వార్తలు