బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వివాదానికి త్వరలోనే తెర

18 Jun, 2021 20:50 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు బ్రహ్మంగారి మఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ క్రమంలో వీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధిని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, స్థానిక నేతలు ఆయన వెంట ఉన్నారు.

కాగా బ్రహ్మంగారి మఠాధిపతి వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి ఇటీవల శివైక్యం చెందిన నేపథ్యంలో పీఠాధిపత్యంపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వారసులతో మంత్రి వేర్వేరుగా మంత్రి చర్చలు కొనసాగిస్తున్నారు. మఠం నివాసంలో వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి రెండవ భార్య మారుతి మహాలక్షుమ్మతో మాట్లాడిన మంత్రి.. టీటీడీ అతిథి గృహంలో మొదటి భార్య కుమారులతో చర్చలు జరిపారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వివాదానికి త్వరలో తెరపడనుందనే సంకేతాలు ఇచ్చారు. వివాదానికి కారణమైన రెండు వర్గాలు ఏకాభిప్రాయంతో నిర్ణయానికి రావాలని  కోరిన ఆయన త్వరలోనే పీఠాధిపతిని ప్రకటిస్తామని పేర్కొన్నారు.

కాగా వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలు. ఆయన పెద్ద భార్య చంద్రావతికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. చంద్రావతి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన పదేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నారు. రెండో భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు మైనర్లు. పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి (53), రెండో భార్య పెద్ద కుమారుడు గోవిందస్వామి (9)ల మధ్య పోటీ నెలకొంది. అయితే గోవిందస్వామి  మేజర్‌ అయ్యేంతవరకు తాను ప్రస్తుతం మఠం బాధ్యతలను తాత్కాలికంగా స్వీకరిస్తానంటూ రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ పోటీలోకి వచ్చారు. దీంతో పీఠాధిపత్యంపై వివాదం నెలకొంది.

చదవండి: ఆధిపత్యంపై ‘పీఠ’ముడి!

మరిన్ని వార్తలు