ఏపీకి అవార్డులు రావడం సంతోషకరం: వెంకయ్యనాయుడు

20 Aug, 2020 18:02 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ -2020 అవార్డులను గురువారం ప్రకటించింది. 10 లక్షలకు పైగా జనాభా కలిగి పరిసరాల పరిశుభ్రతలో ఉత్తమ పనితీరు కనపరిచిన 10 నగరాల జాబితాలో నాలుగవ స్థానంలో విజయవాడ, ఆరవ స్థానంలో తిరుపతి, తొమ్మిదవ స్థానంలో విశాఖపట్నంలు నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం,  జిల్లాలు నాలుగు, ఆరు, తొమ్మిదవ స్థానాలలో చోటు సంపాధించడం ఆనందదాయకమని  ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్‌ చేశారు. ఏపీకి వచ్చిన స్థానాల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఆయా నగరాల అధికార యంత్రాంగానికి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఈ జాబితాలో మరోసారి ఇండోర్ తొలి స్థానంలో నిలిచింది. విర్చువల్ ప్రోగ్రామ్ ద్వారా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ నిర్వహించిన స్వచ్ఛ మహోత్సవంలో మొత్తం 129 పట్టణాలు, రాష్ట్రాలకు అవార్డులను ప్రకటించారు. దేశంలోని మొత్తం 4,242 నగరాలు, పట్టణాలు, 62 కంటోన్మెంట్ బోర్డులు, 92 గంగా పరివాహక ప్రాంతాల్లోని పట్టణాల్లో సర్వే నిర్వహించారు. మొత్తం 28 రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులను కేటాయించారు.  స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు 2016 సంవత్సరం నుంచి ప్రకటిస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు