‘ఏపీలో ఫోరెన్సిక్‌ వర్శిటీ ఏర్పాటు పరిశీలించాలి’

22 Sep, 2020 16:59 IST|Sakshi

న్యూఢిల్లీ : గుజరాత్‌లో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఫోరెన్సిక్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రాజ్యసభ  సభ్యులు విజయసాయి రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాజ్యసభలో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్ యూనివర్శిటీ బిల్లుపై జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే తొలిసారిగా గుజరాత్‌లో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్శిటీ ఏర్పాటును వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆయన స్వాగతించారు. దేశంలో నేరాలు జరిగే తీరు, నేర దర్యాప్తు, నేరాల వెనుక కారణాలను విశ్లేషించడంలో ఇలాంటి యూనివర్శిటీ ప్రముఖ పాత్ర పోషించగలవని అన్నారు. (విశాఖలో ట్రైబ్యునల్ బెంచ్‌ ఏర్పాటు చేయండి‌)

అయితే నేరాలు కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కానందున పోలీసుల నేర పరిశోధనలో సహకరించేందుకు దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఇలాంటి వర్శీటీ  వలన ఫోరెన్సిక్‌ సైన్సెస్‌లో స్పెషలిస్టులు తయారవుతారని చెప్పారు. హైదరాబాద్‌లో అత్యంత అధునాతనమైన ఫోరెన్సిక్‌ లేబరేటరీ ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఫోరెన్సిక్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలించాలని ఆయన కేంద్ర హోం మంత్రికి విజ్ఞప్తి చేశారు. (‘రైతుల కోసమే సీఎం జగన్‌ నిర్ణయం’)

మరిన్ని వార్తలు