-

న్యాయశాఖ మంత్రికి విజయసాయి రెడ్డి విజ్ఞప్తి

22 Sep, 2020 10:28 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని నగరం అయిన విశాఖపట్నంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్) బెంచ్‌ను ఏర్పాటు చేయవలసిందిగా రాజ్యసభ జీరో అవర్‌లో మంగళవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కేంద్ర న్యాయశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు వ్యవహారాల్లో తలెత్తే వివాదాలు, ఫిర్యాదులను పరిష్కరించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 323 (ఏ) కింద ప్రతి రాష్ట్రంలో  సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్స్‌ బెంచ్‌ ఏర్పాటు జరుగుతుందని విజయసాయి రెడ్డి చెప్పారు. దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో క్యాట్‌ ఏర్పాటు జరగలేదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 50 వేల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తున్నారు. అందులో 60 శాతం మంది విశాఖపట్నంలోనే పని చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో క్యాట్‌ బెంచ్‌ లేనందున పిటిషనర్లు తమ వివాదాల పరిష్కారం కోసం పొరుగు రాష్ట్రంలోని హైదరాబాద్‌కు ప్రయాణం చే వస్తోంది. వ్యయ ప్రయాసలతో కూడిన ప్రయాణాల వలన ఉద్యోగులు చాలా అసౌకర్యానికి గురవుతున్నారని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు.  (భూ దోపిడీపై నిగ్గు తేల్చండి)

విశాఖపట్నంలో స్టీల్‌ ప్లాంట్‌, షిప్‌ యార్డ్‌, కస్టమ్స్‌, పోర్టు, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌, రైల్వేస్‌, ఎయిర్‌పోర్ట్‌, హెచ్‌పీసీఎల్‌, ఎల్‌ఐసీ వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలలో వేలాది మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అందువలన ఉద్యోగుల సౌలభ్యం కోసం చైర్మన్‌, సభ్యులతో కూడిన క్యాట్‌ బెంచ్‌ను విశాఖపట్నంలో నెలకొల్పవలసిందిగా విజయసాయి రెడ్డి న్యాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.  (రాజ్యసభలో విశాఖ వాణి)

విశాఖలో ట్రిపుల్ ఐటీని నెలకొల్పాలి
అత్యధిక జనాభా కలిగి పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖలో ట్రిపుల్ ఐటీని నెలకొల్పాలని రాజ్యసభలో కేంద్ర విద్యాశాఖ మంత్రికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఏయూలో తాత్కాలిక భవనాల్లో పనిచేస్తున్న ఐఐఎంకు శాశ్వత భవనాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. 

మరిన్ని వార్తలు