విశాఖ ఉక్కు కార్మికుల నిరసనలకు మద్ధతిస్తాం: విజయసాయిరెడ్డి

14 Jul, 2021 13:28 IST|Sakshi

సాక్షి, విశాఖ: పార్లమెంట్‌ సమావేశాల్లో స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఆగష్టులో జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టబోయే కార్మికుల నిరసనలకు మద్దతు ప్రకటిస్తామని తెలిపారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్‌తో స్టీల్‌ప్లాంట్ కార్మికులు బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. విపక్ష నేతల మద్దతుతో పార్లమెంటులో తమ గళం వినిపిస్తామని భరోసా ఇచ్చారు. ఆర్ధిక, ఉక్కుశాఖ మంత్రులను కలుసి మాట్లాడతామని అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయానికి తాము వ్యతిరేకమని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేశామని గుర్తు చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం సరికాదని విజయసాయిరెడ్డి అన్నారు. నష్టాల్లో ఉన్న సంస్థలను లాభాల్లోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టాలని, స్టీల్‌ప్లాంట్‌ రుణాలను ఈక్విటీగా మార్చాలని తెలిపారు. మైనింగ్‌ను కేటాయిస్తే తక్కువ ధరకు ముడిసరుకు లభిస్తుందని పేర్కొన్నారు. కాగా జాతి సంపదను ప్రైవేటీకరణ చేయడం సరికాదని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో చేపట్టబోయే నిరసనలకు మద్దతు ఇవ్వాలని కార్మికులు కోరగా.. మంత్రి అందుకు అంగీకరించారు.

మరిన్ని వార్తలు