'నీకెందుకు జన్మనిచ్చానా అని సొంత జిల్లా కన్నీరు పెడుతుంది..'    

6 Jul, 2021 15:46 IST|Sakshi

సాక్షి, అమరావతి: సొంత జిల్లాలోని సాగునీటి ప్రాజెక్ట్‌లకు అడ్డుతగులుతూ, తన అనూనయులతో గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్లు వేయించిన చంద్రబాబు రైతు ద్రోహి అని, అలాంటి వ్యక్తి చిత్తూరు గడ్డపై పుట్టడం ఆ జిల్లా వాసుల దురదృష్టమని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. గతంలో మహానేత వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్ట్‌లపై ప్రసాద్ నాయుడు అనే తన అనుకూలస్తుని చేత కేసులు వేయించి రెండేళ్లు అడ్డుకున్న చంద్రబాబు.. ఇప్పుడు సీమ ఎత్తిపోతల పథకంతో పాటు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చిత్తూరు జిల్లా ప్రాజెక్టులకు అడ్డుతగులుతున్నాడని ఆరోపించారు. 

రైతులు చల్లగా ఉంటే ఓర్వలేని చంద్రబాబు.. సొంత జిల్లా ప్రాజెక్ట్‌లపైనే స్టే కోరుతూ తన వాళ్ళతో గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్లు వేయించాడని ఆరోపించారు. తనకు రాజకీయ బిక్షపెట్టిన సొంత గడ్డకు మేలు చేయాల్సింది పోయి, సాగునీటి ప్రాజెక్ట్‌లకు అడ్డుతగులుతూ, ఆ ప్రాంత రైతుల కడుపు కొడుతున్న రైతు ద్రోహి చంద్రబాబు అని విమర్శించాడు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం.. పిల్లను, పదవిని ఇచ్చిన మామకు వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజమని ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లాలోని 1.10లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే 3 రిజర్వాయిర్లను అడ్డుకునేందుకు ఎన్జీటీలో పిటిషన్లు వేయించిన చంద్రబాబును చూసి నీకెందుకు జన్మనిచ్చానా అని సొంత జిల్లా కన్నీరు పెడుతోందని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు