అమెరికాలో దుర్గమ్మకు కుంకుమార్చనలు

27 May, 2022 05:46 IST|Sakshi
విశేష అలంకరణలో అమ్మవారు

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): బెజవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్లకు అమెరికాలోని పలు నగరాల్లో కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. ప్రవాసాంధ్రుల కోసం ఏటా దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో అమెరికాలో ఆర్జిత సేవలు జరిగేవి. కోవిడ్‌ వల్ల రెండేళ్లుగా ఈ సేవలను నిలిపివేశారు. కోవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది నుంచి ఆర్జిత సేవలను పునఃప్రారంభించాలని దేవదాయ శాఖ నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో దుర్గమ్మ దేవస్థానం నుంచి అమెరికాకు ఉత్సవమూర్తులను తీసుకెళ్లారు. అమ్మవారికి అలంకరించేందుకు ఆభరణాలను అమెరికాకు పంపించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గురువారం శాన్‌హోస్‌లోని శ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానంలో ఆది దంపతులకు ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శాంతి కల్యాణం, చండీ హోమాలు నిర్వహించారు. 3 రోజుల పాటు ఈ ఆలయంలో పూజలు జరుగనున్నాయి.  

29 నుంచి లాస్‌ఏంజెల్స్‌లో..
ఈ నెల 29 నుంచి 31 వరకు లాస్‌ఏంజెల్స్‌లోని శ్రీ శివకామేశ్వరి దేవస్థానంలో, జూన్‌ 2 నుంచి 4 వరకు న్యూజెర్సీలోని సాయి దత్తపీఠం, శ్రీ శివవిష్ణు ఆలయాల్లో, జూన్‌ 5 నుంచి 7 వరకు బాల్టిమోర్‌లోని శ్రీ షిర్డీసాయి మందిర్‌తో పాటు మరికొన్ని ఆలయాల్లో ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. జూన్‌ 11న ఆలయ అర్చకులు దేవతా విగ్రహాలతో తిరిగి భారత్‌కు చేరుకుంటారు. 

మరిన్ని వార్తలు