రూబీ లాడ్జి: హరీష్‌ ఇంట విషాదం.. 10 రోజుల క్రితమే రెండో బిడ్డ జననం

13 Sep, 2022 11:37 IST|Sakshi

సాక్షి, విజయవాడ: సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్‌లో అగ్ని ప్రమాదం కారణంగా ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, మృతుల్లో విజయవాడకు చెందిన హరీష్‌ కూడా ఉన్నారు. దీంతో, విజయవాడలో హరీష్‌ ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. 

కాగా, ఈ దురదృష్టకర ఘటనపై హరీష్‌ కుటుంబ సభ్యులు స్పందించారు. హరీష్‌ కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. బ్యాంకు ట్రైనింగ్‌ ఉందని హరీష్‌ ఆదివారం రాత్రి సికింద్రాబాద్‌ వెళ్లారు. మూడు రోజుల్లో మళ్లీ వస్తానని చెప్పారు. ఎంటెక్‌, ఎంబీఏ చేసిన మొదట కోస్టల్‌ బ్యాంక్‌లో ఉద్యోగం చేశాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ.. ఎస్వీటీ బ్యాంకులో ఉద్యోగం రావడంతో ట్రైనింగ్‌ కోసం వెళ్లాడు. 

నిన్న హరీష్‌ ఫ్రెండ్‌ ఫోన్‌ చేసిన తను ఉన్న హోటల్‌లో మంటలు వస్తున్నాయని చెప్పాడు. రాత్రంతా మేము టెన్షన్‌ పడుతుండగా.. తెల్లవారుజామున 3 గంటలకు హరీష్‌ గాంధీ ఆసుపత్రిలో ఉన్నాడని హైదరాబాద్‌లో ఉన్న తన ఫ్రెండ్‌ ఫొటో తీసి పంపించాడు. హరీష్‌కు ఇద్దరు పిల్లలున్నారు. చిన్న బాబు.. 10 రోజుల క్రితమే జన్మించాడు. ఇంతలోనే ఇలా జరగడం ఆవేదనకు గురిచేస్తోందని కన్నీటిపర్యంతమయ్యారు. 
 

మరిన్ని వార్తలు