క్వీన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియాగా భవానీ

1 Sep, 2020 08:39 IST|Sakshi

సాక్షి, అగనంపూడి(గాజువాక): క్వీన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా కిరీటాన్ని విశాఖ జిల్లా కూర్మన్నపాలేనికి చెందిన అమ్మాయి దక్కించుకుంది. ఇండియన్‌ మీడియా వర్క్స్‌ సీఈవో జాన్‌ అమలాన్‌ సారథ్యంలో ఈ ఏడాది జూన్‌ 28 నుంచి ఆగస్టు 25 వరకు చెన్నై కేంద్రంగా కింగ్‌ అండ్‌ క్వీన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా 2020 ఆన్‌లైన్‌ పోటీలు నిర్వహించారు. మూడు రౌండ్లలో జరిగిన ఈ పోటీల్లో గాజువాక మండలం కూర్మన్నపాలేనికి చెందిన కె.భవానీ దుర్గ క్వీన్‌ కిరీటం సాధించింది. ఈ పోటీల్లో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళా రాష్ట్రాలకు చెందిన మగువలు పాల్గొన్నారు.

మొదటి రౌండ్‌లో గ్రీన్‌ ఇండియా చాలెంజ్, రెండో రౌండ్‌లో ర్యాంప్‌ వాక్, మూడో రౌండ్‌లో వివిధ సామాజిక, సమకాలిన అంశాలపై ప్రశ్నలు సందించారు. పోటీల ఫలితాలు గత నెల 30న వెలువడ్డాయి. మూడు విభాగాల్లో భవానీదుర్గా ప్రతిభ చూపి క్వీన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియాగా ఎంపికైంది. భవానీ నగరంలోని ఆదిత్యా డిగ్రీ కళాశాలలో చదువుతోంది. తండ్రి సత్యనారాయణ, తల్లి వరలక్ష్మిల ప్రోత్సాహంతో తనకు ఈ అరుదైన గుర్తింపు లభించిందని భవానీదుర్గా చెప్పింది. 

మరిన్ని వార్తలు