సరుకు రవాణాలో విశాఖ పోర్టు సరికొత్త రికార్డు

9 Apr, 2022 08:39 IST|Sakshi

దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖ పోర్ట్‌ అథారిటీ (వీపీఏ) 2021–22 ఆర్థిక సంవత్సరంలో 69.03 మెట్రిక్‌ టన్నుల సరుకు రవాణా చేసి మూడో అత్యధిక రికార్డును నమోదు చేసినట్లు వీపీఏ చైర్మన్‌ కె.రామమోహనరావు వెల్లడించారు. శుక్రవారం సిరిపురం ప్రాంతంలో ఉన్న పోర్టు అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 89 ఏళ్ల పోర్టు చరిత్రలో రెండేళ్ల క్రితం 72.72 మిలియన్‌ టన్నుల కార్గో హ్యాండ్లింగ్‌ చేసి రికార్డు సృష్టించగా.. ఈ ఏడాది కాస్త తగ్గినట్లు వివరించారు.

ఈ సంవత్సరం థర్మల్‌ కోల్‌లో 100 శాతం, స్టీమ్‌ కోల్‌లో 38 శాతం, కంటైనర్స్‌లో 0.05 శాతం వృద్ధి ఉన్నప్పటికీ.. కోవిడ్, హెచ్‌పీసీఎల్‌ ఆధునీకరణ వంటి కారణాల వల్ల ఆయిల్‌ 11 శాతం తగ్గినట్లు చెప్పారు. అలాగే ఐరన్‌ ఓర్‌ 23 శాతం, కోకింగ్‌ కోల్‌లో 18 శాతం క్షీణత ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో  160, 170 డాలర్లకు వెళ్లిన టన్ను ఐరన్‌ ఓర్‌ ధర  90 డాలర్లకు పడిపోయిందన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. 5 ఏళ్లలో 78 మెట్రిక్‌ టన్నులు లక్ష్యం, వీపీఏ వచ్చే ఐదేళ్లలో 78 మెట్రిక్‌ టన్నుల కార్గో హాండ్లింగ్‌ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా అన్‌రాక్, ఎన్‌ఎండీసీ, తమిళనాడుకు చెందిన టాన్‌జెన్‌కోతో ఒప్పందం చేసుకున్నామన్నారు.   

మరో ఏడాదిలో క్రూయిజ్‌ టెర్మినల్‌.. 
ఇక్కడ నుంచి దేశంలో ముంబై, గోవా వంటి ప్రాంతాలకే కాకుండా ఇతర దేశాలకు క్రూయిజ్‌లో వెళ్లే సౌకర్యం మరో ఏడాదిలో అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. 2 వేల మంది ప్రయాణికుల సామర్థ్యానికి తగ్గట్లుగా దీన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ స్థాయిలో ఫిషింగ్‌ హార్బర్‌.. సాగరమాల కార్యక్రమంలో కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌లో భాగంగా విశాఖలో రూ.150 కోట్లతో ప్రపంచ స్థాయి ఫిషింగ్‌ హార్బర్‌ను వచ్చే ఏడాదిలోగా తయారు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

సాగరమాల ద్వారా  రూ.3,769 కోట్లతో 23 ప్రాజెక్టులు.. 
సాగరమాల ప్రాజెక్టు కింద విశాఖ పోర్ట్‌ అథారిటీ పరిధిలో రూ.3,769 కోట్లతో 23 ప్రాజెక్టులు, పనులు చేపట్టినట్లు చెప్పారు.వీటిలో కొన్ని నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. సీహార్స్‌ జంక్షన్‌ నుంచి డాక్‌ ఏరియాకు ఫ్లైఓవర్‌ నిర్మాణానికి డీపీఆర్‌ సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇన్నర్‌ హార్బర్‌లో ఓఆర్‌–1, ఓఆర్‌–2 బెర్తులు 366 మీటర్ల నుంచి 606 మీటర్లకు పొడవు పెంపు పనులు వచ్చే ఏడాది నాటికి పూర్తవుతాయన్నారు. వీటితో పాటు 38 కిలోమీటర్లు రైల్వేలైన్‌ ఎలక్ట్రిఫికేషన్‌ పనులు చేపట్టినట్లు తెలిపారు. పోర్టు బొగ్గు, ఇనుప ధాతువుల ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్న నేపథ్యంలో దుమ్ము, ధూళి పైకి లేవకుండా కవర్‌షెడ్ల నిర్మాణానికి టెండర్లు ఇచ్చినట్లు చెప్పారు.  డబ్ల్యూక్యూ–7, 8 బెర్తుల్లో బొగ్గు, ఇనుప ఖనిజాలను హ్యాండిల్‌ చేస్తున్నపుడు వచ్చే దుమ్ము, ధూళిని నియంత్రించేందుకు పీపీపీ పద్ధతిన యాంత్రీకరణ పనులు చేస్తున్నట్లు చెప్పారు.

ప్రైవేట్‌ పోర్టులతో పోటీ.. 
ప్రైవేట్‌ పోర్టులతో పోటీ ఉన్న మాట వాస్తవమే.  అదానీ గ్రూప్‌తో ఎటువంటి వివాదం లేదు. అందుకే మంచి ధరలు, వేగవంతమైన సేవలు, రోడ్, రైల్‌ నెట్‌వర్కులు కలిగిన విశాఖ పోర్టు సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునీకరణ వైపు వేగంగా అడుగులు వస్తోంది. గతంలో పోర్టులో నిర్వహించిన కార్యకలాపాలు సక్రమంగా లేకపోవడంతో సంబంధిత సిబ్బందిని టెర్మినేట్‌ చేశాం. వారికి చెల్లించాల్సిన నిధులను చెల్లించాం. ప్రస్తుతం ఆర్బిట్రేషన్‌ కొనసాగుతుంది.  
– కె.రామమోహనరావు, వీపీఏ చైర్మన్‌

మరిన్ని వార్తలు