తొలి ప్రయత్నంలోనే డీఎస్పీ ఉద్యోగం 

8 Jul, 2022 18:57 IST|Sakshi
కుటుంబసభ్యులతో విష్ణుస్వరూప్‌రెడ్డి

నెల్లూరు: ‘క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగినప్పుడే కలలను సాకారం చేసుకోగలం. విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు పుస్తక పఠానానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవే తన విజయానికి బాటలు వేశాయి.’ అని గ్రూప్‌–1లో విజేతగా నిలిచి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైన వల్లెం విష్ణుస్వరూప్‌రెడ్డి అన్నారు.  నెల్లూరు మాగుంటలేఅవుట్‌లోని పావని అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న వల్లెం ప్రతాప్‌రెడ్డి విశ్రాంత మున్సిపల్‌ ఉద్యోగి. ఆయన సతీమణి వెంకటరమణమ్మ గృహిణి. వారికి విష్ణుస్వరూప్‌రెడ్డి, సుక్రుతరెడ్డి సంతానం. విష్ణుస్వరూప్‌రెడ్డి చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎంలో బీటెక్‌ ఈసీఈ పూర్తి చేశారు.

చిన్నప్పటి నుంచి ప్రజాసేవ చేయాలన్న ఆకాంక్ష అతడిలో బలంగా ఉండేది. మేనమామ శివారెడ్డి, ఇంకా డాక్టర్‌ వివేకానందరెడ్డి ప్రోత్సాహంతో ఢిల్లీలో సివిల్స్‌కు శిక్షణ తీసుకున్నారు. గ్రూప్‌–1 ప్రకటన వెలువడడంతో ప్రణాళికతో సన్నద్ధమై రాశారు. తొలి ప్రయత్నంలోనే డీఎస్పీగా ఎంపికయ్యారు. కుమారుడు డీఎస్పీగా ఎంపికవడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ప్రస్తుతం విష్ణుస్వరూప్‌రెడ్డి దుబాయ్‌లో ఎంబీఏ చదువుతున్నారు.

మరిన్ని వార్తలు