‘చరిత్రలోనే ఇళ్ల నిర్మాణం సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది’

3 Jun, 2021 13:59 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా ఇళ్ల నిర్మాణం నిలిచిపోతుందని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. పేద ప్రజల గుండెల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిరస్థాయిగా నిలిచిపోగా.. తిరిగి ఆయన కుమారుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదలు గుండెల్లో నిలిచిపోయే విధంగా నిర్మాణాలు చేస్తున్నారని కొనియాడారు. వెల్లంకి గ్రామములో ఇళ్ల నిర్మాణాలకు మంత్రి శ్రీనివాసరావు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాలనీలే కాకుండా ఊర్ల నిర్మాణం చేస్తున్నారని.. రోడ్లు, డ్రైనేజీలు, ఇంటర్నెట్ సౌకర్యాలు చేస్తున్నారని తెలిపారు.

పేదలు జీవితంలో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయని, పాదయాత్రలో ఇచ్చిన హామీలను సీఎం ఈరోజు నెరవేరుస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, ఒక్కో ఇళ్ళ రూపంలో 15 లక్షలు విలువ చేసే ఆస్తి ఇస్తున్నారని తెలిపారు. విశాఖలో రెండు లక్షల ఇళ్లు కోర్టు వాయిదాల కారణంగా వాయిదా పడుతోందని, త్వరలో సమస్య పరిష్కారం అవుతుందన్నారు. మొదటి దశలో జిల్లా వ్యాప్తంగా 50,050 ఇళ్ళు నిర్మాణం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్‌ తెలిపారు. కోర్టు వివాదాలు కారణంగా నిలిచినా.. విశాఖ వాసుల ఇళ్ళు పూర్తి చేసి న్యాయం చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు