ఆండ్ర కోటకు 308 ఏళ్లు

18 Jan, 2021 07:59 IST|Sakshi

విజయనగరం : మెంటాడ మండలంలోని ఆండ్ర గ్రామం వద్ద ఉన్న కోట చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. బొబ్బిలి రాజ్యానికి సమీపంలో ఉన్న సంస్థానం ఆండ్ర రాజ్యం. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ఆండ్రకోట ఇప్పుడు సందర్శనీయ స్థలంగా మారింది. మెంటాడ, పాచిపెంట, విశాఖ జిల్లాలోని అనంతగిరి మండలాలకు చెందిన సుమారు 28 గ్రామాలకు ఆండ్ర కోట సంస్థానంగా ఉండేది. ఇక్కడి కోటను 308 ఏళ్ల కిందట 1713వ సంవత్సరం జనవరి 18న నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఆండ్ర సంస్థానాదీశులు విజయనగరం రాజులకు విధేయులుగా ఉండేవారు.

విజయనగరం యుద్ధం జరిగిన సమయంలో విజయనగరం రాజులు వారసులను ఆండ్ర సంస్థానంలో దాచి ఉంచారట. ఆండ్ర తొలి సంస్థానాధీశుడిగా గుమ్మిడి పెదరామందొర ఉండేవారు. కాలక్రమేణా గారం దొర, గార ప్రతాప్‌రాజు, రామప్రతాప్‌రాజు, బహుదూర్‌ హరహర ప్రతాపరాజులు కొనసాగారు. ప్రస్తుతం వైద్య వృత్తిలో ఉన్న ఆండ్ర బాబా వారసులుగా ఉన్నట్లు సమాచారం. కోట గత వైభవాన్ని కోల్పోతోందని, పురావస్తుశాఖ దృష్టి సారించి కోటకు పూర్వవైభవాన్ని తీసుకురావాలని సందర్శకులు కోరుతన్నారు.

మరిన్ని వార్తలు