70 ఏళ్లుగా అడవిలోనే.. కర్పూరమే ఆహారంగా

13 Sep, 2021 08:09 IST|Sakshi

విజయనగరం: పురాణాల్లోనూ, కథల్లోనూ మునులు ఒంటరిగా అడవుల్లో తపస్సులు చేసుకుంటూ ఉంటారని విని ఉంటాం కానీ చూసిన అనుభవం లేదు. కానీ ఈ ఆధునిక యుగంలో అలాంటి వాళ్లు ఉన్నారంటే నమ్మలేం కదా! కానీ పద్మావతి అనే వృద్ధురాలిని చూస్తే నమ్మక తప్పదేమో. ఆమె ఏడు దశాబ్దాలుగా ఒంటరిగా అడవిలోనే ఉంటుంది. కర్పూరాన్ని ఆహారంగా తీసుకుంటూ దైవ చింతనలోనే గడపుతూ ఉంటుందట. ఆ వివరాలు

విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పెదకాద గ్రామంలోని 85 ఏళ్ల పద్మావతి అనే వృద్ధురాలు గ్రామానికి సమీపంలోని అడవిలోనే ఏడు దశాబ్దాలుగా ఒంటరిగా జీవిస్తోంది.  తనని వేంకటేశ్వర స్వామి పిలుస్తున్నారంటూ.. 12 ఏళ్ల వయసులో పద్మావతి అడవిలోకి వెళ్లి.. అక్కడే నివాసం ఏర్పరుచుకుందని స్థానికులు చెబుతున్నారు.

కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమెను తీసుకురావాలని ఎంతగా ప్రయత్నించిన పద్మావతి అంగీకరించేది కాదట. తన దైవం వేంకటేశ్వర స్వామి అని.. అక్కడి నుంచి రాలేనని చెప్తూ.. కొండపై విగ్రహాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉంటుందని అంటున్నారు స్థానికులు. ఈ క్రమంలో చుట్టుపక్కల గ్రామస్తులంతా కలిసి ఆ కొండ పై గుడి నిర్మించామని తెలిపారు.

పద్మావతి భక్తుల తెచ్చే పాలు, పళ్లు, కానుకలు ఏమి తీసుకునేది కాదని, అవన్నీ మళ్లీ తిరిగి తమకే ఇచ్చేస్తుందని స్థానికులు చెబుతున్నారు. పైగా ఆహారం ఏమి తీసుకోకుండా కేవలం భక్తులు సమర్పించే కర్పూరం, అగరబత్తుల దూపం, టీ మాత్రమే తీసుకుంటుందని తెలిపారు. పద్మావతి జీవన శైలి దేవుడు ఉన్నాడు అనేదానికి నిదర్శనంగా నిలుస్తుందంటున్నారు భక్తులు
 

మరిన్ని వార్తలు