కరోనా వేళ ఆదుకున్న నవరత్నాలు

8 Jul, 2021 04:43 IST|Sakshi

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాల పథకాలు కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలందరినీ ఎంతో ఆదుకున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పేదలందరికీ రూ.5 వేలు, రూ.10 వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమచేస్తే వాళ్లు ఖర్చు పెట్టుకుంటారని, దీనివలన ఆర్థికంగా అందరికీ బాగుంటుందని మేధావులు చెప్పారని పేర్కొన్నారు. అదేవిధంగా నవరత్నాల పథకాల ద్వారా సీఎం జగన్‌ ప్రజలను ఆదుకున్నారని చెప్పారు.

ఇటువంటి పథకాలు తమకెందుకు అమలు చేయడం లేదంటూ ఇతర రాష్ట్రాల ప్రజలు బాధపడ్డారన్నారు. జగన్‌ సీఎం అయ్యాక వివిధ సంక్షేమ పథకాల కింద రాష్ట్రంలోని పేద ప్రజల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.లక్ష కోట్లు జమచేశారని చెప్పారు. ఇన్ని పథకాలు అందిస్తూ మంచిపేరు తెచ్చుకున్న జగన్‌ పోలవరం నిర్వాసితుల పట్ల కూడా ఇదే విధానం అమలు చేయాలని కోరారు. 2013లో భూసేకరణ చట్టం రాకముందే భూసేకరణలో అదే విధానాలను దివంగత వైఎస్సార్‌ అమలు చేశారని చెప్పారు. ఇండియాలోనే పవర్‌ఫుల్‌ సీఎం అయిన వైఎస్సార్‌ విధానాలను అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే అవి మరింత ముందుకు వెళతాయంటూ మేధాపాట్కర్‌ కితాబిచ్చారని గుర్తుచేశారు. నదీజలాల వివాదంలో జగన్, కేసీఆర్‌ స్నేహపూర్వకంగా మాట్లాడుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు