మరో ఘనత సాధించిన వాల్తేర్‌ డివిజన్‌

29 Mar, 2022 23:31 IST|Sakshi
ఇటువంటి వ్యాగన్‌లకు క్లీనింగ్, స్వీపింగ్‌ ఎన్‌ఎఫ్‌ఆర్‌ ద్వారా చేపట్టనున్నారు

తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ఈస్ట్‌కోస్ట్‌రైల్వే, వాల్తేర్‌ డివిజన్, డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ అనూప్‌కుమార్‌ సత్పతి నేతృత్వంలో నాన్‌ ఫేర్‌ రెవెన్యూ (ఎన్‌ఎఫ్‌ఆర్‌)ప్రాజెక్టులలో డివిజన్‌ మరో ఘనత సాధించింది. ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరుస్తూనే, నిర్వహణ, హౌస్‌ కీపింగ్‌ వ్యయాలను తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తోంది. అదే సమయంలో ఎన్‌ఎఫ్‌ఆర్‌ ద్వారా సరికొత్త పద్ధతులలో డివిజన్‌కు ఆదాయాన్ని ఆర్జించిపెట్టే పథకాలను ప్రవేశపెట్టి, విజయవంతంగా ముందుకు వెళుతోంది. దీనిలో భాగంగా మరో విభాగంలో ఈ ఎన్‌ఎఫ్‌ఆర్‌ ప్రాజెక్టును అమలు చేయనుంది.

వాల్తేర్‌ డివిజన్, కమర్షియల్‌ బ్రాంచ్‌ ఆధ్వర్యంలో వ్యాగన్‌ క్లీనింగ్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా ప్రవేశపెడుతోంది. ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు ఆసక్తిగల వ్యవస్థాపక సంస్థల నుంచి ఓపెన్‌ టెండర్లను ఇప్పటికే ఆహ్వానించింది. దీనికి మంచి స్పందన వచ్చింది. విశాఖపట్నం కాంప్లెక్స్‌లో గల గ్యారేజ్‌ అండ్‌ వ్యాగన్‌ పాయింట్స్‌ వద్ద వ్యాగన్స్‌ స్వీపింగ్, క్లీనింగ్‌ కు సంబంధించిన విభాగాలలో ఓపెన్‌ టెండర్‌ విధానాలను ఎన్‌ఎఫ్‌ఆర్‌ పద్ధతిలో ఖరారు చేయడం వాల్తేర్‌ డివిజన్‌ పరిధిలోమాత్రమే కాదు, ఈస్ట్‌కోస్ట్‌రైల్వే జోన్‌ పరిధిలో సైతం మొదటిదని సీనియర్‌ డీసీఎం తెలిపారు.

దీని ద్వారా మూడేళ్లకు డివిజన్‌కు సుమారు ఆరుకోట్ల ఎన్‌ఎఫ్‌ఆర్‌ ఆదాయం లైసెన్స్‌ ఫీజు కింద సమకూరనుందని తెలిపారు. ఈ పనులకు గాను సుమారు ఏటా రూ.30లక్షలు ఖర్చు చేసినట్లు అయితే ఈ ప్రాజెక్టు ద్వారా రైల్వేకు ఏటా సుమారు రూ.2కోట్లు ఆదాయం రానున్నట్లు అధికారులు తెలిపారు. ఇటువంటి ప్రాజెక్టు ద్వారా డివిజన్‌కు ఆదాయం సమకూరడం మాత్రమే గాక, హౌస్‌కీపింగ్, క్లీనింగ్‌ ఖర్చులను బాగా ఆదా చేస్తుందని ఈ సందర్భంగా డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సత్పతి తెలిపారు.

మరిన్ని వార్తలు