కొత్త కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు నీటి వసతి

8 Mar, 2021 04:47 IST|Sakshi

8,316 లేఅవుట్లలో బోర్లు.. పైప్‌లైన్లు  

ఈ నెల 31లోగా జియో ట్యాగింగ్‌ పూర్తి చేయాలని ఆదేశం

మొదటి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు నీటి వసతిని కల్పించే పనులు వేగవంతం అయ్యాయి. అదే వేగంతో నిర్మాణ పనులూ కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా పేద కుటుంబాలకు సొంత గూడు సమకూరనుంది. రాష్ట్రంలో మొదటి విడత 15.60 లక్షల ఇళ్లు నిరి్మంచాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇళ్లు మంజూరైన లబ్దిదారుల వివరాలతో ఈ నెల 31లోగా జియో ట్యాగింగ్‌ పూర్తి చేయాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి నియోజకవర్గంలో సమీక్ష సమావేశాలు నిర్వహించి.. ఆ మేరకు పూర్తి సమాచారంతో ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్లకు సూచించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచే సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి పనులను పరిశీలించారు. వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బంది లేకుండా అత్యవసరంగా 8,316 చోట్ల నీటి సరఫరా చేయాల్సిన అవసరం ఉందని గుర్తించి.. ఆయా ప్రాంతాల్లో కొత్తగా బోర్లు వేయించడంతోపాటు పైప్‌లైన్‌ పనులు చేస్తున్నారు.

నీటి సరఫరా అవసరమని గుర్తించిన లేఅవుట్లు ఇవే.. 
తూర్పుగోదావరిలో 753, ప్రకాశంలో 432, కర్నూలులో 501, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులో 249, వైఎస్సార్‌లో 405, చిత్తూరులో 942, శ్రీకాకుళంలో 745, విశాఖపట్నంలో 466, విజయనగరంలో 876, పశ్చిమ గోదావరిలో 890, గుంటూరులో 546, కృష్ణాలో 1,092, అనంతపురం జిల్లాలో 419 లేఅవుట్లలో బోర్లు తవ్వి పైప్‌లైన్లు వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే చాలాచోట్ల బోర్లు వేస్తున్నారు. ఇప్పటివరకు తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 534 లేఅవుట్‌లలో నీటి వసతి ఏర్పాటు చేశారు. ఈ పనులను గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ నీటి పనుల విభాగం, పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్య విభాగం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కాగా, ఇంటి నిర్మాణంలో ఎక్కడా నాసిరకానికి ఆస్కారం లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించడంతో ఆ మేరకు గృహనిర్మాణ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలోగా కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలను సిద్ధం చేశారు. లబి్ధదారుల అవగాహన కోసం ప్రతి కాలనీలో మోడల్‌ హౌస్‌ను నిర్మిస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు