లోకేష్‌ పర్యటనకు టీడీపీ నేతలు దూరం 

27 Oct, 2020 09:21 IST|Sakshi

సాక్షి, ఏలూరు: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ పర్యటనకు పలువురు నేతలు గైర్హాజరు అయ్యారు. జాతీయ కమిటీ ప్రకటనలో తనకు ప్రాధాన్యత ఇవ్వనందుకు అలిగిన మాజీ మంత్రి పీతల సుజాత లోకేష్‌ కార్యక్రమానికి గైర్హాజరు అయ్యారు. కమిటీ ప్రకటన తర్వాత ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసుకున్న ఆమె ఎవరికీ అందుబాటులో లేరు. జాతీయ కమిటీలో వంగలపూడి అనితకు ప్రాధాన్యత ఇచ్చి మహిళా అధ్యక్షురాలుగా నియమించడంతో పాటు పాయకరావుపేట ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు ఇవ్వడం, తనను కనీసం పట్టించుకోకపోవడం పట్ల ఆమె పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు. రెండు దశాబ్దాల పాటు పార్టీకి సేవలు అందించినా, పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నా తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆమె కినుక వహించినట్లు సమాచారం.  (డ్రెయిన్‌లోకి లోకేశ్‌ ట్రాక్టర్‌)

అదే సమయంలో చాలా మంది నాయకులు పార్టీ ఓటమి తర్వాత నిస్తేజంగా ఉండిపోయారు. రెండుసార్లు ఉండి ఎమ్మెల్యేగా ఉండి, నర్సాపురం పార్లమెంట్‌ సభ్యునిగా పోటీ చేసిన వేటుకూరి వెంకట శివరామరాజు అలియాస్‌ కలవపూడి శివ, తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని, భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, ఎమ్మెల్సీ పాందువ్వ శ్రీను, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ ముత్యాల వెంకటేశ్వరరావు(రత్నం), ఆర్టీసీ రీజినల్‌ మాజీ డైరెక్టర్‌ మెంటే పార్థసారథి, ఇంకా నియోజకవర్గ స్థాయి నేతలు గాదిరాజు బాబు, ఆకివీడు మండల టీడీపీ అధ్యక్షుడు మోటుపల్లి రామ వర ప్రసాద్,  కాళ్ల మాజీ ఎంపీపీ ఆరేటి తాత పండు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తోట ఫణి తదితరులు వివిధ కారణాలతో గైర్హాజరు కావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.   (బాబు, లోకేష్‌ కనబడుట లేదు)

మరిన్ని వార్తలు