దారుణం: పసికందును పీక్కుతున్న​ కుక్క

27 Jan, 2021 19:01 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని చాగల్లు మండలం ఊనగట్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు పొదలలో వదిలేయడంతో ఆ పసికందు మృతదేహాన్ని కుక్కలు రోడ్డుమీదకు ఈడ్చుకు వచ్చాయి. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు గ్రామ మహిళా పోలీసు తెలియజేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. విషయం తెలిసిన ఐసీడీఎస్ అధికారులు సైతం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పసికందు మృతదేహం పడి ఉన్న తీరును పరిశీలించిన ఐసీడీఎస్ సీడీపీఓ ఆశా రోహిణి సంఘటనా స్థలాన్ని పరిశీలించడంతో ఆ దగ్గర్లోనే పొదలలో ఎవరో గుర్తు తెలియని మహిళ ప్రసవం జరిగినట్లు గుర్తించారు. ప్రసవం జరిగిన  ఆనవాళ్లను కనుగొన్నారు.

పొలాల్లోనే ప్రసవించిన మహిళ పసికందును వదిలి వెళ్ళిపోవడంతో పసికందు మృతి చెందిందని తెలిసింది. పొదలో ఉన్న పసికందు మృతదేహాన్ని కుక్క నోటకరచుకొని వస్తుండగా స్థానికులు గమనించి విధించడంతో రోడ్డుపైనే పసికందు మృతదేహాన్ని కుక్క వదిలి వెళ్ళిపోయింది. వెంటనే స్థానికులు గ్రామ మహిళా కానిస్టేబుల్ ద్వారా పోలీసులకు, ఐసిడిఎస్ అధికారులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇటువంటి అవాంఛనీయ గర్భం ధరించిన మహిళలు ఐసీడీఎస్ అధికారులకు తెలియజేస్తే తగు చర్యలు తీసుకుంటామని పిల్లలను సంరక్షించి తామే వేరే వారికి దత్తత ఇవ్వడం జరుగుతుందన్నారు. దయచేసి ఇలాంటి పాపపు పనులు చేయొద్దని ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్ అధికారి ఆశా రోహిణి తెలియజేశారు.

మరిన్ని వార్తలు