మున్సిపోల్స్‌: జిల్లాల వారిగా ఏకగ్రీవాల వివరాలు

3 Mar, 2021 16:03 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. ఎన్నికలు జరుగనున్న 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 17,418 నామినేషన్లు దాఖలు కాగా, 2,900 మందికిపైగా అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కాసేపట్లో అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ అధికారికంగా ప్రకటించనుంది. మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ఈనెల 10న జరుగనుండగా, 14న ఫలితాలు వెలువడునున్నాయి. ఇక ఏకగ్రీవాల విషయానికొస్తే.. పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ తన హవాను కొనసాగించింది. 

చిత్తూరు కార్పొరేషన్‌లో వైఎస్సార్సీపీ పాగా.. 

చిత్తూరు కార్పొరేషన్‌ పరిధలోని 50 డివిజన్లకు గాను 37 డివిజన్లు ఏకగ్రీవం కావడంతో ఎన్నికలతో సంబంధం లేకుండా కార్పొరేషన్‌ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకంది. దీంతోపాటు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు మున్సిపాలిటీలు కూడా వైఎస్సార్సీపీ ఖాతాలో చేరాయి. మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. ఇక పలమనేరు మున్సిపాలిటీలో 26 వార్డులకు గాను 18 వార్డులు, నగరి మున్సిపాలిటీలో 7 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మదనపల్లి మున్సిపాలిటీలో 35 వార్డులకు గాను 15 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. తిరుపతి కార్పొరేషన్‌ పరిధిలోని 19 డివిజన్లను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది.

వైఎస్సార్ జిల్లాలో తిరుగేలేదు.. 

పులివెందుల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 33 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాయచోటి మున్సిపాలిటీలోని 34కు 34 వార్డులు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీ లోని 20 వార్డుల్లో 13 స్థానాల్లో, బద్వేలు మున్సిపాలిటీలోని 35 వార్డులకు గాను 10 వార్డుల్లో, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని 41 వార్డులకు గాను 9 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప కార్పొరేషన్‌లోని 50 డివిజన్లలో 23 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

వైఎస్సార్సీపీ ఖాతాలో డోన్‌, ఆత్మకూరు మున్సిపాలిటీలు.. 

కర్నూల్ జిల్లాలోని డోన్ మున్సిపాలిటీని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులకు గాను 22 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరధిలోని 24 వార్డులకు గాను 15 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు కార్పొరేషన్‌లోని 34, 35 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నంద్యాల మున్సిపాలిటీలో 42 వార్డులకు గాను 12, ఆళ్ళగడ్డ మున్సిపాలిటీలోని 27 వార్డులకు గాను 8, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 2, ఆదోని మున్సిపాలిటీలో 9, నందికొట్కూరు మున్సిపాలిటీలోని 29 వార్డులకు గాను 4 వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అనంతపురం జిల్లాలోని గుత్తి మున్సిపాలిటీలో 6 వార్డులు, ధర్మవరం మున్సిపాలిటీలో 10 వార్డులు, గుంతకల్లు మున్సిపాలిటీలోని 3 వార్డులు, తాడిపత్రిలో 2 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది.

ప్రకాశం జిల్లాలో మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డుల్లో  వైఎస్సార్సీపీ  అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చీరాల మున్సిపాలిటీలోని 33 వార్డులకు గాను 3, గిద్దలూరు మున్సిపాలిటీలో 20 వార్డులకు 7, మార్కాపురం మున్సిపాలిటీలోని 35 వార్డులకుగాను 5 వార్డులు, కనిగిరి నగర పంచాయతీలోని 20 వార్డులకు గాను 7 వార్డుల్లో  వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట మున్సిపాలిటీలోని 25 వార్డులకు గాను 13 వార్డుల్లో, ఆత్మకూరు మున్సిపాలిటీలోని 23 వార్డుల్లో 6 వార్డులు, నాయుడుపేట మున్సిపాలిటీలోని 25కి గాను 21 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

మాచర్ల, పిడుగురాళ్ల వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్‌..

గుంటూరు జిల్లాలోని మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. మాచర్ల మున్సిపాలిటీలోని మొత్తం 31 వార్డుల్లో, పిడుగురాళ్లలోని మొత్తం 33 వార్డుల్లో  వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వినుకొండ మున్సిపాలిటిలో 7, రేపల్లె మున్సిపాలిటీలో 4, సత్తెనపల్లిలో 2, తెనాలిలో 2, గుంటూరు కార్పొరేషన్‌లో 1 డివిజన్‌( 48వ డివిజన్‌)ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది.

కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతీలో 2 వార్డులు, తిరువూరు నగర పంచాయతీలో 2 వార్డులు, నూజివీడు మున్సిపాలిటీలోని 32 వార్డులకు గాను 2 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది.

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం, తుని మున్సిపాలిటీల్లోనూ  వైఎస్సార్సీపీ హవా కొనసాగింది. రామచంద్రాపురం మున్సిపాలిటీలో 28 వార్డులకు గాను 10 వార్డులు, తుని మున్సిపాలిటీలోని 30 వార్డులకుగాను 15 వార్డులు, అమలాపురం మున్సిపాలిటీలోని 30 వార్డులకు గాను 6, పిఠాపురంలో 6, సామర్లకోటలో 28 వార్డుల్లో  2, ముమ్మిడివరంలో 20 వార్డుల్లో 1 వార్డును వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది.

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్‌లో 3 డివిజన్లు, కొవ్వూరు మున్సిపాలిటీలో 9 వార్డులు, నర్సాపురం మున్సిపాలిటీలో 31 వార్డులకు గాను 3 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది.

విశాఖ జిల్లాలోని యలమంచిలి మున్సిపాలిటీలో 25 వార్డులకు గాను 3 వార్డులను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మున్సిపాలిటీలో 20 వార్డులకుగాను 2 వార్డులు, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో 31 వార్డులకు గాను 2 వార్డుల్లో వైఎస్సార్సీపీ ఏకగ్రీవం.

విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీలోని 30 వార్డులకు గాను 6 వార్డులు, బొబ్బిలి మున్సిపాలిటీలో 1 వార్డులో వైఎస్సార్సీపీ ఏకగ్రీవం.

మరిన్ని వార్తలు