గుక్క పట్టి ఏడుస్తూ.. వద్దమ్మా అంటున్నా ఆమె మనసు కరగలేదు

24 Dec, 2022 11:41 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, ప్రకాశం (వేటపాలెం): అభం శుభం తెలియని బాబుకు.. తన తల్లి ఏం చేస్తుందో తెలియక.. గుక్క పట్టి ఏడుస్తూ.. వద్దమ్మా వద్దు అంటున్నా ఆమె మనసు కరగలేదు.. పిల్లాడు చూస్తుండగానే బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బాపట్ల జిల్లా వేటపాలెంలోని పద్మశాలి వీధిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు పద్మశాలి వీధిలో అద్దె ఇంట్లో అమరలింగేశ్వరరావు, అనూష (26) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి కాగా ఒక పాప, బాబు ఉన్నారు.

అమరలింగేశ్వరరావు బేల్దారి పనులు చేస్తుంటాడు. అయితే శుక్రవారం ఉదయం భర్త పని కోసం వెళ్లాడు. ఏం జరిగిందో తెలియదు కానీ.. అనూష ఇంట్లో ఉన్న సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొనేందుకు ఉపక్రమించింది. ఇంట్లోనే ఉన్న ఐదేళ్ల కుమారుడికి తల్లి ఏంచేస్తుందో అర్థం కాలేదు. ఏడుస్తూ వద్దమ్మా అని వేడుకున్నా ఆమె వినలేదు. దీంతో బాలుడు ఇంటి ముందు ఉన్న వారిని తీసుకొచ్చేలోపే తల్లి ప్రాణాలు వదిలింది.

భార్య, భర్తలు అన్యోన్యంగానే ఉంటారని స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న ఎస్సై జి.సురేష్, సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.  

చదవండి: (అంబులెన్స్‌కు చోటివ్వని చంద్రబాబు కాన్వాయ్‌)

మరిన్ని వార్తలు