బద్వేలులో దారుణం.. ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తూ..

30 Dec, 2022 10:54 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, వైఎస్సార్‌ కడప: ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కన్న కొడుకునే హత్యచేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన మారుతినాయక్‌ లారీడ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఇతను 14 ఏళ్ల క్రితం బెంగుళూరుకు చెందిన కవితను ప్రేమవివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరు కొన్నేళ్లుగా ప్రొద్దుటూరులో నివాసం ఉంటూ ఇటీవలే ఖాజీపేటలోని చెమ్మళ్ళపల్లెకు వచ్చి స్థిరపడ్డారు.

లారీడ్రైవర్‌గా పనిచేసే మారుతినాయక్‌కు అదే వృత్తిలో ఉండే వినోద్‌ అనే యువకుడు పరిచమయ్యాడు. తరుచూ మారుతినాయక్‌ ఇంటికి వస్తూపోతూ ఉండే వినోద్‌ కవితతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం వినోద్, కవితలు ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి పరారయ్యారు. కొద్దిరోజుల పాటు అక్కడక్కడ తిరుగుతూ మూడు నెలల క్రితం బద్వేలులోని రూపరాంపేటలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తుండేవారు. అప్పట్లో మారుతినాయక్‌ తన భార్య, ఇద్దరు పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిసింది.

చదవండి: (కొంతకాలంగా పెళ్లి సంబంధాలు.. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా..)

ఈ క్రమంలో కవిత, వినోద్‌లు బద్వేలులో ఉన్నట్లు తెలిసి మారుతినాయక్‌ తన సోదరితో వచ్చి కవితను ప్రశ్నించాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న వినోద్‌ పరారయ్యాడు. కుమార్తె ఒక్కతే ఉంది, కుమారుడు ఎక్కడ అని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో మారుతినాయక్‌ బద్వేలు అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అర్బన్‌ పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

అయితే 15 రోజుల కిందట రాత్రివేళల్లో బాలుడు ఎక్కువగా ఏడుస్తుండటంతో వినోద్‌ తీవ్రంగా కొట్టడంతో మృతిచెందినట్లు సమాచారం. దీంతో ఇరువురు కలిసి అద్దెకు ఉంటున్న ఇంటి ఆవరణలోని ఖాళీస్థలంలో గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పూడ్చివేసినట్లు తెలిసింది. ఈ విషయంపై అర్బన్‌ సీఐ వెంకటేశ్వర్లును వివరణ కోరగా ప్రస్తుతానికి బాలుడు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేశామని, పూర్తిస్థాయిలో విచారించి తదుపరి విచారణ ప్రారంభిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు