పేగు బంధం చిన్నబోయింది

28 Jan, 2021 08:40 IST|Sakshi

కన్న కూతురిని వద్దనుకున్న తల్లి

తల్లిని గెంటేసిన కూతురు

తాడేపల్లి మండలంలో వేర్వేరు ఘటనలు 

తాడేపల్లి రూరల్‌: పేగు బంధం చిన్నబోయింది. ఓ కన్నతల్లి తన కుమార్తెను వద్దనుకోగా.. మరోచోట ఓ కుమార్తె వృద్ధురాలైన తల్లిని ఇంటినుంచి గెంటేసింది. తాడేపల్లి మండలంలో బుధవారం వేర్వేరు చోట్ల ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లి పట్టణానికి చెందిన ఓ యువతి సుమారు మూడేళ్ల క్రితం ప్రాతూరుకు చెందిన ఓ యువకుణ్ణి ప్రేమ వివాహం చేసుకుంది. కొంతకాలానికి వారికి కుమార్తె జన్మించింది. ఆ తరువాత ఆ దంపతులు విడిపోయి వేర్వేరుగా ఉంటుండగా.. కుమార్తె తల్లి దగ్గరే పెరిగింది. ఇటీవల సదరు యువతి తనను భర్త వేధిస్తున్నాడంటూ తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పెద్దల రంగప్రవేశంతో కేసు వాపసు తీసుకుంది. ఈ క్రమంలో కుమార్తె తనకు వద్దంటూ.. తండ్రికి అప్పగించి వెళ్లిపోయింది. తల్లి కావాలంటూ ఆ బాలిక గుక్కపెట్టి ఏడుస్తున్నా వెనుదిరిగి చూడకుండానే ఆ తల్లి వెళ్లిపోయింది.(చదవండి: ప్రేమ పెళ్లి, పోలీస్‌ స్టేషన్‌కు వధూవరులు)  

పెనుమాకలో వృద్ధురాలి గెంటివేత 
మరోవైపు పెనుమాక గ్రామంలో ఓ వృద్ధురాలిని కన్న కూతురే ఇంటినుంచి గెంటేసి.. ఇంటికి తాళాలు వేసుకుంది. గ్రామానికి చెందిన రావూరి చిన్నమ్మాయి అనే వృద్ధురాలు 2010లో ఇందిరమ్మ పథకం కింద రెండు పోర్షన్ల ఇల్లు నిర్మించుకుంది. ఒక పోర్షన్‌లో కొడుకు కోటేశ్వరరావు, రెండో పోర్షన్‌లో కుమార్తె నాగమణి నివాసం ఉంటున్నారు. అయితే, ఇటీవల తన అన్నయ్య, తల్లి కలిసి తన ఇల్లు ఆక్రమించుకున్నారంటూ నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి చిన్నమ్మాయి ఇల్లు తనకు మంజూరైందని, తానే కట్టించుకున్నానని చెప్పడంతో.. పోలీసులు చనిపోయేంత వరకు తల్లి ఆ ఇంట్లోనే ఉండేవిధంగా చెప్పి పంపించారు. అయితే బుధవారం కుమార్తె నాగమణి తల్లి చిన్నమ్మాయిని ఇంటినుంచి బయటకు గెంటేసి ఇంటికి తాళం వేసింది. దిక్కుతోచని స్థితిలో వృద్ధురాలు రోడ్డు పాలైంది.  
 

మరిన్ని వార్తలు