విశాఖ: మిస్టరీగా మహిళ మర్డర్‌.. ఆ ఇంట్లో ఏం జరిగింది? 

6 Dec, 2022 10:51 IST|Sakshi

వీడని మహిళ హత్య కేసు మిస్టరీ  

డ్రమ్ములో మహిళ మృతదేహం కేసు విచారణ వేగవంతం 

ఐదు పోలీస్‌ బృందాల ఏర్పాటు 

పీఎంపాలెం (భీమిలి): మహిళ హత్య మిస్టరీ ఇంకా వీడలేదు. హత్య సంఘటనలో అంతులేని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో పాత్రధారులు, సూత్రధారుల నిగ్గుతేల్చే పనిలో 5 పోలీసుల బృందాలున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, పర్లాకిమిడి ప్రాంతాల్లో మూడు బృందాలు విచారణకు పంపినట్టు  సీఐ వై. రామృష్ణ తెలిపారు. కొమ్మాది వికలాంగుల కాలనీ లో సీలు వేసిన డ్రమ్ములో మహిళా మృతదేహం ఆదివారం బయటపడిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. 

దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు...కొమ్మాదిలో ఉంటున్న నండూరి రమేష్‌ తన ఇంటిని రుషి అనే వ్యక్తికి 2019లో అద్దెకిచ్చాడు. రుషి తన భార్యతో ఆ ఇంట్లో ఉంటున్నాడు. ఇంటి యజమాని రమే‹Ùకు వెల్డింగ్‌ షాపు ఉంది. ఆ షాపులో రుషిని పనికి పెట్టుకున్నాడు. 2020లో రుషి భార్య డెలివరీ కోసమని పార్వతీపురం జిల్లా పాలకొండ దరి సీతంపేటకు తీసుకువెళ్లాడు. 2021 ఏప్రిల్‌లో ఒక్కడే తిరిగొచ్చాడు. రెండు రోజుల అనంతరం మళ్లీ తిరిగి వెళ్లి పోయాడు. 

ఇంట్లో ఎవరూ లేకపోయినా పెరిగిన కరెంట్‌ బిల్లు 
అద్దెకు ఇచ్చిన ఇంట్లో ఎవరూ నివసించకపోయినా కరెంట్‌ బిల్లులు అధికంగా వస్తుండటంతో ఇంటి యజమాని రమేషకు అనుమానం వచ్చి వాస్తవం తెలుసుకోవడానికి ఆదివారం సాయంత్రం రుషికి అద్దెకు ఇచ్చిన ఇంటికి వెళ్లాడు. ఇంటో లైట్లు వెలిగి ఫ్యాను తిరుగుతూ కని పించింది. ఇంట్లో మాత్రం ఎవరూ లేరు. ఇంటి వద్ద వాటర్‌ డ్రమ్ముకు సీలు వేసి ఉండడంతో అదేంటో చూద్దామని మూత తొలగించడందో భరించరాని దుర్గంధం వెదజల్లింది. మహిళ అస్తిపంజరం కనిపించడంతో భయకంపితుడయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఆ మృతదేహం సుమారు 2 నెలల కిందటే ఆ డ్రమ్ములో పెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 

ఇంతకీ ఆ మహిళ ఎవరు? 
రెండు నెలలు క్రితం హత్యకు గురైన మహిళ ఎవరు? ఎక్కడో హత్య చేసి ఇక్కడకు తీసుకొచ్చి డ్రమ్ములో పెట్టి సీలు వేశారంటే ఎంతో పకడ్బందీగా చేసిన వ్యవహారంగా తెలుస్తోంది. అంతేకాకుండా రుషి 2021 నుంచి ఆ ఇంట్లో ఉండడం లేదని, ఇల్లు ఖాళీగా ఉందని ఇంటి ఓనర్‌ రమేష్‌ చెబుతున్నాడు. ఇంట్లో రుషి లేకపోయినా కరెంటు బిల్లు ఎక్కువ వస్తుండడంతో ఆ ఇంట్లో ఎవరు ఉన్నారు. రుషికి తెలిసే ఈ వ్యవహారం నడిచిందా. లేక ఇల్లు ఖాళీగా ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు హత్య కోసం వినియోగించారా? అనేది మిస్టరీగా ఉంది. అంతేకాకుండా రుషి 2021 ఏప్రిల్‌ నుంచి ఇంట్లో ఉండడం లేదని చెబుతున్న రమేష్‌ మరి ఆ ఇంటిని వేరే వాళ్లకు ఎందుకు అద్దెకు ఇవ్వలేదన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.  

పోలీసుల అదుపులో రుషి? 
హత్య జరిగిన ఇంట్లో అద్దెకు ఉంటున్న రుషిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. అయితే పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారించలేదు.   
 

మరిన్ని వార్తలు