పండుగలా ‘వైఎస్సార్‌ ఆసరా’ వారోత్సవాలు

12 Oct, 2021 04:41 IST|Sakshi
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, పొదలగుంటపల్లిలో పాలాభిషేకం చేస్తున్న డ్వాక్రా మహిళలు

సీఎం జగన్‌ ఫొటోలకు మహిళలు పాలాభిషేకాలు

4 రోజులుగా 350 మండలాల్లో 3.94 లక్షల సంఘాలకు రూ. 3,249.19 కోట్లు పంపిణీ

లబ్ధిదారులతో జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల ముఖాముఖి

నాటి చంద్రబాబు మోసం.. నేటి జగన్‌ హామీ అమలుపై చర్చ 

ముఖ్యమంత్రికి పొదుపు సంఘాల మహిళలు కృతజ్ఞతలు 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్సార్‌ ఆసరా వారోత్సవాలు పండుగ వాతావరణంలో సాగుతున్నాయి. మహిళలు ఊరూరా సభలు పెట్టి సీఎం వైఎస్‌ జగన్‌ ఫొటోలకు పాలాభిషేకం చేస్తూ తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల్లోని మహిళల పేరుతో ఉన్న బ్యాంకు అప్పును ప్రభుత్వమే భరిస్తూ, ఆ మొత్తాన్ని వైఎస్సార్‌ ఆసరా పథకం  ద్వారా నాలుగు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం తెలిసిందే. రెండో విడతకు సంబంధించి ఈ నెల ఏడో తేదీ నుంచి పది రోజులపాటు సంబంధిత సంఘాల ఖాతాలకు ప్రభుత్వం డబ్బులు జమచేస్తుంది. 

78.76 లక్షల మంది మహిళలకు రూ.6,439 కోట్లు
రాష్ట్రవ్యాప్తంగా 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 78.76 లక్షల మంది మహిళలకు రెండో విడత కింద రూ.6,439.52 కోట్లు అందజేయడానికి సర్కారు ఏర్పాట్లుచేయగా.. బద్వేలు ఉప ఎన్నికల కారణంగా వైఎస్సార్‌ కడప జిల్లాలో పంపిణీ వాయిదా పడింది. మిగిలిన 12 జిల్లాల పరిధిలో 7.55 లక్షల సంఘాలకు సంబంధించి 74.81 లక్షల మంది మహిళలకు రూ.6,099 కోట్లు అందిస్తున్నారు. ఇది ఈ నెల 18 వరకు కొనసాగుతుంది. గత నాలుగు రోజులుగా 12 జిల్లాల పరిధిలోని పొదుపు మహిళలకు రూ.3,249.19 కోట్లు పంపిణీ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. 
తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడిలో జరిగిన వైఎస్సార్‌ ఆసరా చెక్కుల పంపిణీ సందర్భంగా డ్వాక్రా మహిళలతో ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్‌   

ప్రజాప్రతినిధులతో మహిళల ముఖాముఖి
ఇక పంపిణీ పూర్తయిన మండలాల్లో జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్‌ చైర్మన్, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో లబ్ధిదారుల ముఖాముఖీ జరిగాయి. 7న 63 మండలాల్లో, 8న 83 మండలాలు, 9న 77 మండలాలు, 10న 63 మండలాల్లో.. 11న 64 మండలాల్లో ఈ కార్యక్రమాలు జరిగాయి. డ్వాక్రా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానని నాడు హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఆయన మోసం చేసిన తీరు.. ఇప్పుడు సీఎం జగన్‌ క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న వైనంపై ఈ ముఖాముఖిలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. 

మహిళల వ్యక్తిగత ఖాతాలో డబ్బులు జమ
పొదుపు సంఘాల పేరిట ప్రభుత్వం జమ చేస్తున్న డబ్బులు వెంటనే ఆ సంఘంలోని సభ్యులందరి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో విడివిడిగా జమ చేసేందుకు క్షేత్రస్థాయిలో సెర్ప్, మెప్మా సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ నెల 17 నుంచి మరో వారం పది రోజులపాటు లబ్ధిదారులందరినీ కలిసి వారికి డబ్బులు ముట్టాయా లేదా అన్న వివరాలను కూడా ఈ–కేవైసీ విధానంలో ధృవీకరించుకునేందుకు కూడా ఏర్పాట్లు చేశాం. 
– ఇంతియాజ్, సెర్ప్‌ సీఈఓ 

మరిన్ని వార్తలు