రోడ్డుపై బైఠాయించిన విశాఖ ప్రజలు
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు
15వ రోజుకు చేరిన విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ రిలే దీక్షలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరం ఉక్కు నినాదాలతో మార్మోగింది. వైజాగ్ స్టీల్ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలంటూ కార్మికులు రోడ్డెక్కారు. గత కొంతకాలంగా దీక్షలు చేపట్టిన ఉద్యమకారులు శుక్రవారం ఉదయం 11 గంటలకు నగరంలోని అన్ని రోడ్లపై బైఠాయించారు. జాతీయ రహదారిపై గాజువాక, ఇసుకతోట, మద్దిలపాలెం జంక్షన్ వద్ద నిరసనను వ్యక్తం చేశారు.
రోడ్డెక్కి రాస్తారోకో నిర్వహించారు. గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు.. నిలువరించడానికి ప్రయత్నించినప్పటికీ ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వైజాగ్ స్టీల్ప్లాంట్ను పరిరక్షించుకుంటామంటూ నినాదాలు చేశారు. ఈ పరిస్థితుల మధ్య పోలీసులకు ఉద్యమకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు.