తల్లిని మించిన స్థానం ఇంకొకటి ఉందా?

10 Jul, 2022 04:00 IST|Sakshi
తనయుడు సీఎం వైఎస్‌ జగన్‌ను ప్రేమతో ముద్దాడుతున్న మాతృమూర్తి విజయమ్మ

తల్లిగా కొనసాగుతానని విజయమ్మ అంటే దుష్ప్రచారం చేస్తున్నారు  

వచ్చే ఎన్నికల్లో 420 బ్యాచ్‌కు రాజకీయ సమాధి 

జగన్‌ను రాజకీయాల నుంచి సమూలంగా తీసేయడానికి కుట్ర 

మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని  

అధికారాన్ని లాక్కునేందుకు ఆ నలుగురు కుతంత్రాలు : అంబటి 

పవన్, బాబు వగైరా అంతా కలిసివచ్చినా జగన్‌ పొట్లాం కట్టేస్తారు : పేర్ని 

బాదుడే బాదుడు కాదు.. వచ్చే ఎన్నికల్లో బాబుకు కుమ్ముడే కుమ్ముడు 

ఎల్లో మీడియా–దుష్టచతుష్టయం తీర్మానంపై చర్చలో నేతలు  

(వైఎస్సార్‌ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి): రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీలకు తన ఇద్దరు పిల్లలు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఎవరికీ ఇబ్బందిలేకుండా గౌరవ అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేసి తల్లిగా కొనసాగనున్నట్లు విజయమ్మ ప్రకటించారని మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. కానీ, తల్లి విలువ తెలియని దుష్టచతుష్టయం దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఈ ప్రపంచంలో తల్లికి మించిన స్థానం ఇంకొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు. రెండోరోజు వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో ‘ఎల్లో మీడియా–దుష్టచతుష్టయం’ తీర్మానంపై జరిగిన చర్చలో ఆయనతోపాటు మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌లతోపాటు మాజీమంత్రి పేర్ని నాని మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో 420 బ్యాచ్‌ రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు, చంద్రబాబులకు రాజకీయ సమాధి చేసి తీరుతామని.. వారికి పిచ్చిపట్టడం ఖాయమన్నారు. ఈ క్రమంలో ‘శ్రీ నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం’ను అమరావతిలో ఐదు ఎకరాల్లో ఏర్పాటుచేసి అందులో వీరందరినీ చేర్పించి, అక్కడే వీరికి శాశ్వతంగా చికిత్స ఇప్పించే బాధ్యత తీసుకుంటామని వివరించారు. కొడాలి నాని ఇంకా ఏమన్నారంటే.. 

తల్లి విలువ తెలియని 420లు గతరెండు, మూడ్రోజులుగా విజయమ్మపై డిబేట్లు పెడుతున్నారు. జగన్‌ తన కుమార్తెను కలిసేందుకు స్పెషల్‌ ఫ్లైట్‌లలో వెళ్తున్నారని చంద్రబాబు మాట్లాడుతున్నాడు.. లోకేష్‌ అమెరికాలో ఉన్నప్పుడు నువ్వు, నీ కుటుంబ సభ్యులు అమెరికాకు నడుచుకుంటూ వెళ్లారా లేక సముద్రంలో ఈదుకుంటూ వెళ్లారా? బాబును తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు సీఎం జగన్‌ను రాజకీయాల నుంచి సమూలంగా తీసేయాలనే కుట్రకు తెరలేపారు. రాష్ట్రంలో పేద పిల్లలు చదవాలన్నా, పేదల సొంతింటిæ కల నెరవేరాలన్నా, వారు ఆర్థికంగా పైకి రావాలన్నా సీఎం జగన్‌ను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.   

రాజకీయ సింహం జగన్‌  
కుళ్లు, కుతంత్రాలు తెలియని రాజకీయ సింహం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. రాష్ట్రంలో ఏ గడప ఎక్కినా, ఏ గుండె తట్టినా జగన్‌ జగన్‌ అనే నినాదమే మార్మోగుతోంది. చంద్రబాబుతో యుద్ధమైతే 5నిమిషాల్లో పూర్తి చేస్తాం.. కానీ, ఆయన వెనకున్న దుష్టచతుష్టయం రామోజీరావు, చంద్రబాబు, ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ5 నాయుడులతో యుద్ధం. వీరు జగన్‌ నుంచి అధికారాన్ని లాక్కునేందుకు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. ఈ దుష్టచతుష్టయం నిత్యం కట్టుకథలు రాసి జగన్‌పై బురదజల్లుతున్నారు. వాటిని ఎదుర్కొనేందుకు అంతా సిద్ధంకావాలి. చంద్రబాబు అధికారంలోకి రావాలని కోరుకుంటున్న ఆయన దత్తపుత్రుడికి కావాల్సింది ప్యాకేజీ మాత్రమే. మీటింగుల్లో ఆయనను సీఎం సీఎం అంటుంటే, ఆయన మాత్రం చంద్రబాబు సీఎం అంటున్నాడు. పార్టీ శ్రేణులంతా గడపగడపకు వెళ్లి జగనన్న సందేశాన్ని వినిపించాలి.
– అంబటి రాంబాబు,జలవనరుల శాఖమంత్రి 

జగన్‌ అంటే తగ్గేదేలే.. 
సోనియా వంటి మహా నాయకురాలికే జగన్‌ భయపడలేదు. ఇక చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ5 నాయుడు ఎంత? భూదేవికి ఉన్నంత సహనం జగన్‌కు ఉంది. జగన్‌ అంటే తగ్గేదేలే. నలుగురు దొంగలు, మేకపిల్ల కథలోలా మొదటి దొంగ చంద్రబాబు, రెండో దొంగ రామోజీరావు అయితే మూడో దొంగ రాధాకృష్ణ, నాలుగో పిల్లదొంగ టీవీ5 నాయుడు. తమ వాడే అధికారంలో ఉండాలి, ఆయన కూడా తమ చెప్పుచేతల్లో ఉండాలనే దుర్మార్గమైన ఆలోచన వీరిది. కానీ, మా నాయకుడు ఆ నలుగురు దొంగలకు బుద్ధిచెప్పే ధైర్యశాలి. ‘సాక్షి’ ఉద్భవానికి కేవలం ఈ దుర్మార్గుల రాక్షస క్రీడే కారణం. ప్రజలకు నిజం చెప్పడానికే ఈ పత్రిక పుట్టింది.  ఆ నలుగురిది కుల ఉన్మాదం. విజయమ్మ ఎంతో హుందాగా మాట్లాడితే విషం చిమ్మారు. పవన్, చంద్రబాబు వగైరా అంతా కట్టకట్టుకుని వచ్చినా జగన్‌ పొట్లాం కట్టి పంపిస్తారు. కార్యకర్తలు జగన్‌ కోసం పనిచేయాలి. ఆయనే శాశ్వతం. జగన్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. 
– పేర్ని నాని, మాజీమంత్రి  

అభివృద్ధి చూసి ఎల్లో మీడియా ఓర్వలేకపోతోంది 
ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఎల్లో మీడియా ఓర్వలేకపోతోంది. చంద్రబాబు, రామోజీ, ఏబీఎన్‌ రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడుకి ఇక్కడ ఇళ్లు కూడా లేవు. వైఎస్సార్‌సీపీ సైన్యం ధాటికి 2024 ఎన్నికల్లో దుష్టచతుష్టయం పారిపోవాల్సిందే. మాట్లాడితే మమ్మల్ని పీకుతామంటున్నారు.. కానీ, ఇప్పటికే వాళ్లని ప్రజలు పీకిపాతరేశారు. చంద్రబాబు హయాంలో వీళ్లంతా గజదొంగల ముఠాలా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకున్నారు. జగన్‌ పాలనలో వాళ్ల అరాచకాలు, అక్రమాలకు బ్రేక్‌ పడడంతో తెగబాధపడుతున్నారు. అందుకే పచ్చ మీడియాలో నిత్యం అసత్య వార్తలు.. డబ్బా చానల్స్‌లో తప్పుడు డిబేట్లు పెడుతున్నారు. బాదుడే బాదుడని తిరుగుతున్న చంద్రబాబుకి 2024 ఎన్నికల్లో కుమ్ముడే కుమ్ముడు.  
– జోగి రమేష్, గృహ నిర్మాణ శాఖ మంత్రి   

మరిన్ని వార్తలు