‘పచ్చ’పాతం: ఇదేమి వైపరీత్యం!

1 Mar, 2021 12:30 IST|Sakshi
కనుగులవలస పంచాయతీ కార్యాలయానికి పసుపు రంగు వేసిన దృశ్యం 

టీడీపీ మద్దతుదారులు సర్పంచులైన చోట్ల  పంచాయతీ కార్యాలయాలకు పచ్చ రంగు

ఇటీవల గెలిచిన వారికి పార్టీ అధిష్టానం హుకుం

అప్పుడే ఓ చోట అమలైన వైనం

చర్యలకు ఉపక్రమిస్తున్న అధికార యంత్రాంగం 

ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకుడొకాయన ఆమధ్య పంచాయతీ ఎన్నికలకూ మేనిఫెస్టో విడుదల చేసి ‘చరిత్ర సృష్టించారు’. జనం అంతా విస్తుపోయే వింతను తెరపైకి తెచ్చారు. ప్రజల అదృష్టం బాగుండి.. ఆయన మద్దతు ఇస్తామన్న వారిలో చాలామందిని జనం తిరస్కరించారు. కానీ.. కొద్దిగా ఎన్నికైన వారితో కూడా ఆయన.. ఆయన పార్టీ పెద్దలు అప్పుడే విచిత్రాలు చేయిస్తున్నట్టున్నారు. అభిజ్ఞ వర్గాల సమాచారం ప్రకారం.. తమ పరిధిలోని పంచాయతీ కార్యాలయాలకు పచ్చ రంగు పులమాలని పెద్దలు  ఆదేశించారంటున్నారు. ఇందుకు నిదర్శనంగా.. కొత్త ఉత్సాహం కాస్త అతి కావడంతో ఓ సర్పంచ్‌ పంచాయతీ ఆఫీసుకు పచ్చ రంగు వేయించేశారు. అధికారులు.. ఆచి తూచి మాట్లాడుతున్నారు. మరి తదనంతర పరిణామాలపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు? 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పంచాయతీ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం వేసిన రంగులపై టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్లారు. ఆ రంగులన్నీ తొలగించాలని పిటిషన్‌ వేశారు. రాజకీయంగా పెద్ద రాద్ధాంతమే చేశారు. చీప్‌ పబ్లిసిటీతో లబ్ధి పొందాలని చూశారు. కానీ ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డారు. ఇప్పుడు.. టీడీపీ మద్దతుదారులు గెలిచిన గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాలకు పసుపు రంగు పూస్తున్నారు. అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలతో అధికారుల అనుమతి లేకుండా ఏకపక్షంగా రంగులు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆమదాలవలస మండలం కనుగులవలస పంచాయతీ కార్యాలయానికి పసుపు రంగు వేసేశారు.

టీడీపీ నేతల ద్వంద్వ నీతి జనాలకు ఈ పనితో అర్థమైంది. ఆ నేతల దుర్నీతిని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలపై ఏ నిర్ణయమైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న సర్కార్‌ తీసుకోవాలి. ప్రభుత్వ ఆదేశాలు, అధికారుల అనుమతి మేరకే పంచాయతీ కార్యాలయాలకు సంబంధించిన ఏ చర్యలైనా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా అధికారుల అనుమతి లేకుండా ఇష్టారీతిన పంచాయతీ కార్యాలయానికి పసుపు రంగు వేసేశారు. తాజాగా ఎన్నికైన సర్పంచ్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. కనీసం పంచాయతీ పాలకవర్గం తీర్మానం కూడా చేయలేదు. ఎక్కడా లేని విచక్షణాధికారంతో ఆగమేఘాలపై పంచాయతీ కార్యాలయానికి రంగులు వేయడం విమర్శలకు తావిస్తోంది.

రౌడీషీటర్‌ బుద్ధి చూపించారా?  
కనుగులవలస సర్పంచ్‌గా ఎన్నికైన నూక సూరప్పలనాయుడు (నూకరాజు)పై రౌడీ షీట్‌ ఓపెన్‌ చేసి ఉంది. వివాదాస్పదమైన వ్యక్తిగా ముద్ర పడ్డారు. గొడవలు, కొట్లాటకు ముందుంటారు. గతంలో ప్రస్తుత శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. తాజాగా సర్పంచ్‌గా గెలిచిన వెంటనే అదే మూర్ఖత్వం చూపించారు. అధికారుల అనుమతి లేకుండా పంచాయతీ కార్యాలయానికి పసుపు రంగు వేయించారు. ఎవరొచ్చి ఏం చేస్తారన్నట్టుగా వ్యవహరించారు. అంతటితో ఆగకుండా పసుపు రంగు వేసిన కార్యాలయంలో విధులు నిర్వహించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఇక్కడికొచ్చి విధులు నిర్వర్తించాలని కూడా సతాయించారు. దీనికి సిబ్బంది ఒప్పుకోలేదు. గ్రామ పంచాయతీ పాలకవర్గమంతా తీర్మానం చేయాలని సుతిమెత్తగా చెప్పారు.

మీమాంసలో తెలుగు తమ్ముళ్లు..  
సర్పంచ్‌లుగా టీడీపీ మద్దతుదారులు గెలిచిన పంచాయతీల్లో పసుపు రంగులు వేయాలని ఆ పార్టీ అ ధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. దీంతో కొందరు అధిష్టానం మాట మేరకు పసుపు రంగు వేసేందుకు యత్నిస్తుండగా, మరికొందరు మనికెందుకని మీమాంసలో పడ్డారు. మొత్తానికి రంగుల రాజకీయం చేసేందుకు టీడీపీ యతి్నస్తుందనేది స్పష్టమవుతోంది.

పసుపు రంగు తొలగిస్తాం.. 
రంగుల విషయం మా దృష్టికి వచ్చింది. రెండు రోజుల క్రితమే పంచాయతీ కార్యాలయానికి రంగులు వేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మాకు వచ్చిన ఫిర్యాదు మేరకు పసుపు రంగు తీసేసి తెలుపు రంగు వేయిస్తాం. 
– పేడాడ వెంకటరాజు, ఎంపీడీఓ, ఆమదాలవలస
చదవండి:
రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబు హైడ్రామా   
వైఎస్సార్‌ సీపీ కార్యకర్తపై టీడీపీ నేత హత్యాయత్నం

 

మరిన్ని వార్తలు