ఆంధ్రాలోనే ఉంటాం.. భద్రాచలాన్ని తిరిగి ఆంధ్రాలో కలపాలి

23 Jul, 2022 13:00 IST|Sakshi

ఎటపాక మండలంలోని 5 గ్రామాల ప్రజా ప్రతినిధుల స్పష్టీకరణ

ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా): తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఆంధ్రాలోని ఎటపాక మండలం పరిధిలోని ఐదు గ్రామ పంచాయతీల ప్రజా ప్రతినిధులు ఆంధ్రాలోనే ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణలో విలీనం చేయాలని తీర్మానాలు చేసినట్టు వస్తున్న ఆరోపణలను వారు ఖండించారు. పురుషోత్తపట్నంలో శుక్రవారం కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీల ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడారు. 

ఎంపీటీసీ సభ్యులు వర్సా బాలకృష్ణ, గొంగడి వెంకట్రామిరెడ్డి, సర్పంచ్‌ బుద్దా ఆదినారాయణ, పార్టీ నేతలు మంత్రిప్రగడ నర్సింహరావులు మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికీ అందుతున్నాయని తెలిపారు. జిల్లాల పునర్విభజన సమయంలో పాడేరు దూరాభారం దృష్ట్యా విలీన మండలాలకు పాలన సౌలభ్యం కోరుతూ ఆ సమయంలో కొందరు తీర్మానాలు చేశారని, అయితే ఆ నాటి తీర్మానాల్లో కొందరి సంతకాలు ఫోర్జరీ చేసి ఇప్పుడు వాటిని వక్రీకరించి చూపిస్తూ తెలంగాణ నేతలు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.

భద్రాచలంలోని కొందరు వ్యాపారులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల కోసం 5 పంచాయతీలను తెలంగాణలో కలపాలనే వాదనను తెరపైకి తెస్తున్నారని చెప్పారు. భద్రాచలాన్ని తిరిగి ఆంధ్రాలో కలపాలని డిమాండ్‌ చేశారు. (క్లిక్: పవన్‌ కళ్యాణ్‌ తీరుపై మత్స్యకారుల మండిపాటు)

మరిన్ని వార్తలు