మొదటి భార్య చనిపోయిందని, ఇక నీతోనే ఉంటానని బీమా కోసం..

25 Nov, 2022 07:12 IST|Sakshi
మహేంద్రబాబు

సాక్షి, నంద్యాల(దొర్నిపాడు): డబ్బు కోసం ఓ ప్రబుద్ధుడు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకుని డబ్బు కోసం పీడించి పిప్పి చేశాడు. రెండో భార్య గమనించి ఆరా తీయగా అతగాడి బండారం బయటపడింది. ఎస్‌ఐ తిరుపాలు తెలిపిన వివరాలు .. చాకరాజువేముల గ్రామానికి చెందిన మహేంద్రబాబు బుర్రారెడ్డిపల్లె గ్రామానికి చెందిన నాగలక్ష్మిదేవిని నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా డబ్బు కోసం పీడించేవాడు.

అతని ప్రవర్తనలో మార్పు గమనించిన భార్య.. ఆరా తీయగా అతనికి ఇంతకుముందే మార్కాపురం గ్రామానికి చెందిన మరో మహిళ లలితతో వివాహమైనట్లు తెలిసింది. ఇదే విషయమై నిలదీయగా మొదటి భార్య చనిపోయిందని, ఇక నీతోనే ఉంటానని నమ్మబలికాడు. ఏదో సాకులు చెబుతూ డబ్బు కోసం శారీరంగా, మానసికంగా వేధించేవాడు. ఆత్మహత్య చేసుకుంటే బీమా సొమ్ము వస్తుందని చావుకు ప్రేరేపించేవాడు.

ఇదంతా తన తల్లి లక్ష్మిదేవికి తెలిసే చేస్తుండటంతో భరించలేక రెండో భార్య పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా మహేంద్రబాబు ఇటీవల కృష్ణా జిల్లా చల్లాపల్లి మండలం నక్కలగడ్డ గ్రామానికి చెందిన భవానీని నమ్మించి మూడో పెళ్లి చేసుకున్నట్లు బయటపడింది. మూడో భార్య తల్లి వద్ద లోన్‌ యాప్‌ ద్వారా రూ.5లక్షలు తీసుకొని మోసం చేశాడు. దీంతో గురువారం మహేంద్రబాబు, అతని తల్లి లక్ష్మిదేవిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.  

చదవండి: (కుమార్తె ప్రేమవివాహం.. ఆటోతో ఢీకొట్టి.. చనిపోయాడనుకొని..)

మరిన్ని వార్తలు