గోనెగండ్ల ఎస్‌ఐ వేధిస్తున్నాడు

30 Jul, 2020 11:15 IST|Sakshi
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రంగస్వామి

కలెక్టరేట్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం 

ఆస్పత్రికి తరలించిన పోలీసు అవుట్‌పోస్ట్‌ సిబ్బంది 

కర్నూలు(సెంట్రల్‌): తనను గోనెగండ్ల ఎస్‌ఐ వేధిస్తున్నాడని ఆరోపిస్తూ కలెక్టరేట్‌ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అప్రమత్తమైన కలెక్టరేట్‌ పోలీసు అవుట్‌ పోస్ట్‌ సిబ్బంది వెంటనే యువకుడిని ఆసుపత్రికి తరలించారు. బాధితుడు తెలిపిన వివరాలు.. గోనెగండ్ల మండలం చిన్నమర్రివీడు గ్రామస్తులంతా చందాలు వేసుకుని ఇటీవల రూ.52 లక్షలతో బీరప్ప ఆలయం నిర్మించారు. గ్రామ పెద్దలు మాలన్న, బిజ్జె వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు, ఎల్లన్న తదితరులు ఆలయ నిర్మాణ బాధ్యతలు చూశారు.

అయితే రూ.2 లక్షల విరాళం ఇచ్చిన అదే గ్రామానికి చెందిన రంగస్వామి నాలుగు రోజుల క్రితం ఖర్చుల వివరాలు అడిగాడు. దీంతో గ్రామ పెద్దలు, రంగస్వామి కుటుంబీకుల మధ్య గొడవ జరిగింది. ఈవిషయమై ఇరువురిపై కేసులు నమోదయ్యాయి. అయితే తనను ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని గోనెగండ్ల ఎస్‌ఐ హనుమంతరెడ్డి వేధిస్తున్నాడని ఆరోపిస్తూ రంగస్వామి బుధవారం ఉదయం కలెక్టరేట్‌కు చేరుకుని గాంధీ విగ్రహం ఎదుట పురుగుల మందు తాగాడు. కాగా అతను కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.     

మరిన్ని వార్తలు