ఊర్లో ఆడవాళ్లు, మగవాళ్లు నామీద ఇంత పగతో ఉన్నారా?

25 Jul, 2022 11:42 IST|Sakshi

విజయనగరం క్రైమ్‌: ఊర్లో ఆడవాళ్లు, మగవాళ్లు నామీద ఇంత పగతో ఉన్నారా? నాకు ఇప్పటివర కూ తెలియదు.  ఈ జనాల మధ్యలో బతకలేను మరి. బై ఫ్రెండ్స్‌’ అంటూ వాట్సాప్‌లో స్టేటస్‌ పెట్టి, రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఈ ఘటనకు సంబంధించిన అందించిన వివరాలిలా ఉన్నాయి. దుప్పాడ గ్రామానికి చెందిన తాళ్లపూడి త్రినాథ్‌ (24) వీటీ అగ్రహారంలో ప్రియా సిమెంట్స్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఊర్లో యువకులంతా కలిసి వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసుకున్నారు. అందులో కొన్ని మెసెజ్‌ల విషయంలో వచ్చిన మనస్పర్థల వల్ల త్రినాథ్‌ తీవ్ర మానసికక్షోభకు గురయ్యాడు.

కొంతమందితో వచ్చిన తగాదాల కారణంగా వన్‌టౌన్‌లో కేసు కూడా నమోదైంది. దీంతో మరింత మనస్తాపం చెందిన త్రినాథ్‌.. ఆదివారం ఉదయం 8.50 గంటలకు వాట్సాప్‌లో స్టేటస్‌ పెట్టి బై ఫ్రెండ్స్‌ అంటూ మెసెజ్‌ చేసి, 9 గంటలకు  అలకానంద కాలనీకి చేరుకుని, రైల్వేట్రాక్‌ పక్కన బైక్‌ పార్క్‌చేశాడు. అదే సమయంలో వస్తున్న సికింద్రాబాద్‌–భువనేశ్వర్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి తల్లి గౌరమ్మ, తండ్రి అప్పారావు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  జీఆర్‌పీ ఎస్సై రవివర్మ తెలిపారు.   

మరిన్ని వార్తలు