మా నాన్న మృతిపై రాజకీయాలు చేస్తావా?

12 Oct, 2020 04:20 IST|Sakshi

లోకేష్‌పై రాజధాని ప్రాంత యువతి మండిపాటు 

సోషల్‌ మీడియా వేదికగా ఘాటైన విమర్శలు 

తాడికొండ: అమరావతి రాజధానికి భూమి త్యాగం చేసిన రైతు గుండె ఆగి మరణించాడంటూ విపక్ష నేత చంద్రబాబు కుమారుడు లోకేష్‌ ట్విట్టర్‌ వేదికగా చేసిన పోస్టుపై మృతుడి కుమార్తె మండిపడ్డారు. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలంటూ ట్విట్టర్‌లోనే ఘాటుగా బదులిచ్చారు. రాజధాని ప్రాంతమైన ఉద్దండరాయునిపాలెంలో తన తండ్రి చినలాజర్‌ మరణాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారంటూ ఎస్తేర్‌ సోషల్‌ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. ‘‘మా నాన్న గురించి ఎవడు చెప్పాడు నీకు.

మా నాన్న మృతిని కంపు రాజకీయాలకు వాడుకోవడానికి నీవెవరు? ఏ నాడైనా మా ఊరు వచ్చావా? మా నాన్న గారిని పరామర్శించి మాట్లాడావా? లంక భూముల సొసైటీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు.. భూముల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా కనీసం ముఖాలైనా చూడలేదు మీరు. వైకాపా నేతల అవమానాలతో బలైపోతున్నారు అంటున్నావు.. నీవు చూశావా.. హైదరాబాద్‌లో దాక్కున్న నీకు మా నాన్న గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? మా నాన్న రాజధాని గురించి కాదు. ఆరోగ్యం బాగోక చనిపోయారు. రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలంటే అందరికీ సమన్యాయం జరగాలి, మన స్వార్థం చూసుకోకూడదు అని జగన్‌ గారి నిర్ణయాన్ని స్వాగతించిన వ్యక్తిత్వం ఉన్న నిజాయతీపరుడు మా నాన్న. నీపై పరువు నష్టం దావా వేస్తా. పోస్ట్‌ డిలీట్‌ చెయ్‌. 

బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ మా కుటుంబానికి అండగా ఉంటా అని భరోసా ఇచ్చి వెళ్లారు. ఇంకెక్కడా వైఎస్సార్‌సీపీ నేతల అవమానాలతో అంటూ రాస్తే ఊరుకోను’’ అని ఎస్తేర్‌ హెచ్చరించింది.   

>
మరిన్ని వార్తలు