మరో 30 ఏళ్లు వైఎస్‌ జగనే సీఎం 

31 May, 2022 11:07 IST|Sakshi

ఒంటరిగా పోటీ చేసే దమ్ము  చంద్రబాబుకు లేదు

మూడేళ్లలో వాగ్దానాలన్నీ అమలు

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి 

వెంకటాచలం: రాష్ట్రానికి మరో 30 ఏళ్లు సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు ఎన్నుకుంటారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి జోస్యం చెప్పారు. వెంకటాచలంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం భారీ కేక్‌ కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకపోవడంతో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడేళ్ల పాలనలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని కొనియాడారు.

చంద్రబాబు వెన్నుపోటుకు ఎన్టీఆర్‌ కాలం చేశారన్నారు. ఆయన శత జయంతి రోజు పూలమాల వేసి కీర్తించడం చూసి ఆత్మ ఘోషించి ఉంటుందన్నారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు అవమానించినా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్టీఆర్‌ జిల్లా నామకరణం చేయడం గొప్ప విషయమన్నారు.

కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలని డిమాండ్‌ చేసిన చంద్రబాబే, చివరకు తమ పార్టీ గూండాలను రెచ్చగొట్టి, శాంతిభద్రతలకు విఘాతంగా కలిగించే విధంగా చేయించడం దుర్మార్గమని మండి పడ్డారు. మంత్రులు ఇళ్లను తగులబెట్టించడం, ఎమ్మెల్యే ఇళ్లపై దాడులకు ప్రేరేపించడం సిగ్గు చేటని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చంద్రబాబు ఏ నాడు మేలు చేయలేదని «ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసే దమ్ము, ధైర్యం ఉందానని ప్రశ్నించారు.

చంద్రబాబుకు తనపై, కొడుకు లోకేష్‌పైనా నమ్మకం లేకపోవడంతో దత్తపుత్రుడును నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ మందా కవిత, వైస్‌ ఎంపీపీ కనుపూరు కోదండరామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి మందల వెంకటశేషయ్య,  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

ఉదయగిరిలో.. 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో సోమవారం సంబరాలు జరుపుకున్నారు. ముందుగా దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచి పెట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ జనం మెచ్చిన నేతగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరు తెచ్చుకొని ప్రజా మన్ననలు పొందుతున్నారని మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కొనియాడారు.  

మరిన్ని వార్తలు