తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం ఏరియల్ సర్వే

27 Nov, 2020 22:20 IST|Sakshi

సాక్షి, అమరావతి: నివర్‌ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న జిల్లాల్లో వరద నష్టాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (శనివారం) ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. శనివారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం.. 9.45 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్‌ పోర్టు చేరుకుంటారు. అక్కడ నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వరద నష్టాన్ని ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరద ప్రభావంపై సమీక్ష నిర్వహిస్తారు. సమీక్షా సమావేశం అనంతరం సీఎం మధ్యాహ్నం 2.05 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు. నివర్‌ తుపానుపై నేడు జరిగిన కేబినెట్‌ సమావేశంలో కూడా సీఎం చర్చించారు. దెబ్బతిన్న పంటలకు డిసెంబర్‌ 30 కల్లా పంట నష్టపరిహారాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. శిబిరాల్లో ఉన్నవారికి రూ.500 ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. (చదవండి: 30 లక్షల ఇళ్ల పట్టాలు: ఏపీ కేబినెట్‌ ఆమోదం)

తుపాను ప్రభావంపై సీఎం వైఎస్‌ జగన్‌ నిన్న తన క్యాంప్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. తుపాను ప్రభావం, కురుస్తున్న వర్షాలపై సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో కరెంటు షాక్‌తో మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించారు. వర్షాలు అనంతరం పంట నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాలని, భారీ వర్షాలుకారణంగా ఏదైనా నష్టం వస్తే.. సత్వరమే సహాయం అందించడానికి సిద్ధం కావాలని ఆదేశాలు ఇచ్చారు. (చదవండి: ‘నివర్‌’ బీభత్సం)

మరిన్ని వార్తలు