కోవిడ్‌పై సీఎం జగన్‌ సమీక్ష

28 May, 2021 17:14 IST|Sakshi

ఒక్కోచోట కనీసం 30 నుంచి 50 ఎకరాలు సేకరించాలి

రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆస్పత్రులకు భూములు కేటాయింపు

ప్రతి జిల్లా కేంద్రం, కార్పొరేషన్‌లలో మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు: సీఎం జగన్‌

తాడేపల్లి: రాష్ట్రంలో కోవిడ్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రుల్లో సమస్యల పరిష్కారం, మందులు, ఆక్సిజన్‌ సరఫరా.. కర్ఫ్యూ పొడిగింపు తదితర అంశాలపై సీఎం వైఎస్ జగన్ అధికారులతో చర్చించారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రజలు వైద్యం కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌కు ఎందుకు వెళ్ళాల్సి వస్తుందో ఆలోచించాలి. రాష్ట్రంలో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి సహా 16 చోట్ల హెల్త్ హబ్‌లు ఏర్పాటు చేయాలి. ఒక్కోచోట కనీసం 30 నుంచి 50 ఎకరాలు సేకరించాలి’’ అని అధికారులను ఆదేశించారు. 

‘‘ఒక్కో ఆస్పత్రికి ఐదు ఎకరాలు కేటాయించాలి. మూడేళ్లలో 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే ఆస్పత్రులకు ఈ భూములు ఇవ్వాలి. దీనివల్ల కనీసం 80కి పైగా మల్టీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తాయి. కొత్తగా 16 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో ప్రైవేట్ రంగంలో కూడా మంచి ఆస్పత్రులు వస్తాయి’’ అని సీఎం జగన్‌ తెలిపారు. 

‘‘ఈ పాలసీ వల్ల ప్రతి జిల్లా కేంద్రం, కార్పొరేషన్‌లలో మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తాయి. టెరిషరీ కేర్‌ మెరుగు పడితే ఇతర ప్రాంతాల్లో వైద్యానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు మంచి వైద్యం అందుతుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ తయారయ్యేలా ఒక విధానం తీసుకురావాలి’’ అని సీఎం జగన్‌ సూచించారు. 

చదవండి: ఆరోగ్యశ్రీలో ఉచితం.. మిగిలిన వారికి ప్రభుత్వ ధరలే

మరిన్ని వార్తలు