మైనింగ్‌ శాఖలో సంస్కరణలపై సీఎం జగన్‌ సమీక్ష

19 May, 2021 20:41 IST|Sakshi

ఈ వేల ద్వారా ఖనిజాల అమ్మకం

సైజు (పరిమాణం) పద్దతిలో కాకుండా బరువు ఆధారంగా సీనరేజీ నిర్ణయం

సెప్టెంబర్‌ నుంచి అమల్లోకి రానున్న నిర్ణయాలు

అమరావతి: మైనింగ్‌ శాఖపై క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. మైనింగ్‌ శాఖలో సంస్కరణలపై చర్చించారు. ఈ– ఆక్షన్‌ ద్వారా మైనర్‌ మినరల్స్‌ అమ్మాలని.. సీనరేజీ ఫీజు వసూలను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించాలని అధికారులు సీఎం జగన్‌కు సూచించారు. గ్రానైట్‌ మైనింగ్‌లో సైజు (పరిమాణం) పద్దతిలో కాకుండా బరువు ఆధారంగా సీనరేజీ నిర్ణయించాలని తెలిపారు. ఇకపై ఎన్ని టన్నులు బరువు ఉంటే.. ఆమేరకు సీనరేజీ ఫీజు వసూలు చేయాలని అధికారులు తెలిపారు. దీనివల్ల కనీసం 35 నుంచి 40శాతం ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. 

లీజులు పొంది, గనులు నిర్వహించని చోట కొత్తగా ఈ వేలం నిర్వహించాలని.. దీని వల్ల ప్రభుత్వానికి మరో వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచాన వేశారు. ఈ నిర్ణయాలకు సీఎం ఆమోదం తెలిపారు. సెప్టెంబరు నుంచి కొత్త నిర్ణయాలు అమల్లోకి  వస్తాయన్నారు అధికారులు. మైనింగ్‌ శాఖలో నిఘా, అమలు విభాగం పటిష్టంగా ఉండాలని.. ఆదాయాలకు గండి పడకుండా చూడాలని సీఎం జగన్‌ ఆదేశించారు. 

వర్షాలు వచ్చేలోగా కనీసం 60 నుంచి 79 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుకను అందుబాటులోకి ఉంచాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. వర్షాలు వల్ల రీచ్‌లు మునిగిపోయే అవకాశం ఉంటుంది. మళ్లీ ఇసుకకు ఇబ్బందులు రాకూడదు అన్నారు. అందుకనే సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచాలని సీఎం జగన్‌ ఆదేశించారు. 

ఈ సమావేశానికి పంచాయతీరాజ్, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మైనింగ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, భూగర్భగనుల శాఖ డైరెక్టర్‌ (డిఎంజి) విజి.వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

చదవండి: మానవత్వాన్ని చాటుకున్న మంత్రి పెద్దిరెడ్డి

మరిన్ని వార్తలు