Andhra Pradesh : 27 నెలల్లో 68 మెగా పరిశ్రమలు

4 Sep, 2021 03:41 IST|Sakshi

రూ.30,175 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తి ప్రారంభం.. 46,119 మందికి ఉపాధి   

ఎంఎస్‌ఎంఈ, టెక్స్‌టైల్స్, స్పిన్నింగ్‌ మిల్స్‌కు ప్రోత్సాహకాల విడుదల సందర్భంగా సీఎం జగన్‌   

రూ.36,384 కోట్ల పెట్టుబడితో త్వరలో మరో 62 భారీ, మెగా ప్రాజెక్టులు  

వైఎస్సార్‌ నవోదయం ద్వారా రుణాల రీషెడ్యూల్‌ 

కొప్పర్తిలో 3,155 ఎకరాల విస్తీర్ణంలో వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌  

రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ప్రణాళిక, 75 వేల మందికి ఉపాధి 

రూ.730 కోట్లతో 801 ఎకరాల్లో వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌  

తద్వారా రెండేళ్లలో మరో 30 వేల మందికి ఉద్యోగావకాశాలు  

రూ.30 వేల కోట్ల పెట్టుబడిని ఆకర్షిస్తూ 10 వేల మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు  

రూ.13 వేల కోట్లతో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టులు 

లక్ష మందికి ఉపాధి లక్ష్యంగా కృష్ణపట్నం గ్రీన్‌ ఫీల్డ్‌ ఇండస్ట్రియల్‌ నోడ్‌ అభివృద్ధి   

ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో రూ.2,500 కోట్లతో సెకండరీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ 

ఆసరా, చేయూత లబ్ధిదారుల్లో 3,72,400 మంది అక్కచెల్లెమ్మలకు దుకాణాలు, పాడి ద్వారా ఉపాధి  

రేషన్‌ డోర్‌ డెలివరీ ద్వారా 18,525 మందికి ప్రత్యక్షంగా ఉపాధి 

స్టేట్‌ బిజినెస్‌ రిఫార్మ్‌ యాక్షన్‌ ప్లాన్‌ రిపోర్టు జాతీయ ర్యాంకుల్లో మన రాష్ట్రానికి మొదటి స్థానం  

మన ప్రభుత్వంపై పెట్టుబడిదారుల నమ్మకం, విశ్వసనీయతకు ఇది నిదర్శనం   

సాక్షి, అమరావతి: మనందరి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ 27 నెలల్లోనే రూ.30,175 కోట్ల పెట్టుబడితో 68 భారీ, మెగా పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ పరిశ్రమల ద్వారా 46,119 మందికి ఉపాధి లభించిందని తెలిపారు. మరో రూ.36,384 కోట్ల పెట్టుబడితో మరో 62 భారీ, మెగా ప్రాజెక్టులు కూడా ప్రారంభం కాబోతున్నాయని, వీటిద్వారా 76,916 మందికి రాబోయే రోజుల్లో ఉపాధి లభిస్తుందని వెల్లడించారు.

శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి ఎంఎస్‌ఎంఈ, టెక్స్‌టైల్స్, స్పిన్నింగ్‌ మిల్స్‌కు ప్రోత్సాహకాలు విడుదల చేసిన సందర్భంగా లబ్ధిదారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. కష్టకాలంలో మన రాష్ట్రంలోని పరిశ్రమలు, వాటి మీద ఆధారపడిన కుటుంబాలకు మరింత దన్నుగా నిలుస్తున్నామని చెప్పారు. 12 లక్షల మందికి ఉపాధినిస్తున్న ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్‌ స్పిన్నింగ్‌ మిల్స్‌కు ఊతమిస్తూ రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేస్తున్నామని చెప్పారు. ఎంఎస్‌ఎంఈలకు నేరుగా దాదాపు రూ.450 కోట్లు, టెక్స్‌టైల్‌ మిల్స్‌ వారి ఖాతాల్లోకి మరో రూ.230 కోట్లు వెళ్తాయన్నారు. టెక్స్‌టైల్‌ మిల్లులకు ఇవ్వాల్సిన రూ.450 కోట్ల విద్యుత్‌ చార్జీ రీయింబర్స్‌మెంట్‌ను వారు భవిష్యత్తులో కట్టబోయే కరెంటు బిల్లుల్లో రిబేటు ఇచ్చేలా చేస్తున్నామని స్పష్టం చేశారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

లబ్ధిదారుల్లో 62 శాతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు

  • మన ప్రభుత్వం ఇస్తున్న ఈ ప్రోత్సాహకాలతో లబ్ధిపొందుతున్న మొత్తం యూనిట్లలో 62 శాతం ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నారు. వీరంతా చిన్న చిన్న వాళ్లు. ఈ యూనిట్లలో 42 శాతం అక్క చెల్లెమ్మలవే. 
  • ఈ బెనిఫిట్స్‌ రాకపోతే వీళ్లందరూ రోడ్డున పడే పరిస్థితి ఉంటుందని గత పాలకులు ఎన్నడూ ఆలోచించలేదు. మనం అధికారంలోకి వచ్చాక పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగావకాశాలు కల్పిస్తూ చట్టం చేశాం.

రూ.3,236 కోట్ల రుణాలు రీ షెడ్యూల్‌ 

  • అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే వైఎస్సార్‌ నవోదయం అనే కొత్త స్కీంను తీసుకు వచ్చి బ్యాంకులతో కలిసికట్టుగా పనిచేస్తూ 1,08,292 ఎంఎస్‌ఎంఈ ఖాతాలకు సంబంధించి రూ.3,236 కోట్ల రుణాలను రీషెడ్యూల్‌ చేశాం. 
  • దీంతోపాటు 2,49,591 ఎంఎస్‌ఎంఈ బ్యాంకు ఖాతాలకు అత్యవసర క్రెడిట్‌ లైన్‌ హామీ పథకాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చాం. తద్వారా రూ.5,973 కోట్ల బ్యాంకు రుణాలతో అదనపు వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణ సదుపాయాన్ని ఏర్పాటు చేశాం. 

కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌

  • రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో 3,155 ఎకరాల విస్తీర్ణంలో వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ను అభివృద్ధి చేస్తున్నాం. దీని ద్వారా దాదాపు 75 వేల మందికిపైగా ఉపాధి లభిస్తుంది.
  • ఇదే కొప్పర్తిలో ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలను ఆకట్టుకునేలా వైఎస్సార్‌ ఈఎంసీ (ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌) స్థాపిస్తున్నాం. దీనిద్వారా దాదాపు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. 801 ఎకరాల్లో రూ.730 కోట్లతో దీనిని ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా అక్కడ మరో 30 వేల మందికి రెండేళ్లలోపే ఉద్యోగావకాశాలు కల్పించే పరిస్థితి ఉంటుంది.

 
రైతుల కోసం 10 వేల మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు

  • 30 సంవత్సరాల పాటు రైతులకు ఉచితంగా, నాణ్యమైన కరెంటును ఎలాంటి ఢోకాలేకుండా ఇచ్చేలా 10 వేల మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయబోతున్నాం.  
  • దురదృష్టవశాత్తు గిట్టని వాళ్లు కోర్టుకు వెళ్లారు. దీనివల్ల టెండర్లు ఖరారు చేసి పనులు మొదలు పెట్టలేకపోయాం. కోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతంగా జరుగుతాయి. రూ.30 వేల కోట్ల పెట్టుబడి రావడమే కాకుండా, యూనిట్‌ రూ.2.48కే కరెంట్‌ అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. 


విద్యుత్, రోడ్లు, నీటిపై దృష్టి

  • మునుపెన్నడూ లేని విధంగా పారిశ్రామిక రంగానికి అవసరమైన విద్యుత్తు, రోడ్లు, నీరు అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో పారిశ్రామిక విధానంలో ఈ అంశాలకు ప్రాధాన్యత కల్పించాం.
  • ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక విధానంలో భాగంగా ఎస్సీలు, ఎస్టీలు, వెనకబడ్డ వారు పరిశ్రమలు స్థాపించేలా వైఎస్సార్‌ బడుగు వికాసం తీసుకు వచ్చాం. రూ.కోటిలోపు పెట్టుబడి పెట్టే ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం, బీసీ వర్గాలకు 35 శాతం పెట్టుబడిలో సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేపట్టాం. 
  • ఇవికాకుండా పవర్‌ సబ్సిడీలు, ల్యాండ్‌ కొనుగోలులో రిబేటు... ఇలాంటి ప్రోత్సాహకాలు కూడా ప్రత్యేకించి ఈ వర్గాలకు అందిస్తున్నాం.

మూడు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ల అభివృద్ధి

  • రాష్ట్ర వ్యాప్తంగా వేగవంతమైన అభివృద్ధి కోసం విశాఖపట్నం– చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్, చెన్నై–బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్, హైదరాబాద్‌– బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తున్నాం. 
  • చెన్నై–బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో భాగంగా రూ.2,139 కోట్ల అంచనా వ్యయంతో దాదాపు 13 వేల ఎకరాల విస్తీర్ణంలో కృష్ణపట్నం గ్రీన్‌ ఫీల్డ్‌ ఇండస్ట్రియల్‌ నోడ్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఈ ఒక్క నోడ్‌ ద్వారానే దాదాపు లక్ష మందికి ఉపాధి లభిస్తుంది. రాబోయే రోజుల్లో చాలా ఫోకస్డ్‌గా కార్యక్రమాలు చేపడుతున్నాం.


రూ.13.5 వేల కోట్లతో కడపలో స్టీల్‌ ప్లాంట్‌

  • రాష్ట్ర పునర్విభజన చట్టంలో కడపలో స్టీల్‌ప్లాంట్‌ పెడతామని కేంద్రం మాట ఇచ్చింది. అయితే అది కార్యరూపం దాల్చకపోవడంతో.. కచ్చితంగా ఆశలు నెరవేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తనంతట తానుగా అడుగులు ముందుకేసింది.
  • ప్రైవేటు పార్టీలతో కలిసి అక్కడ ప్లాంట్‌ పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాం. ఏపీ పునర్విభజన చట్టంలో ప్రస్తావించిన ప్రకారం 3 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో రాష్ట్ర ప్రభుత్వమే అడుగులు ముందుకేసి వైఎస్సార్‌ జిల్లా సున్నపురాళ్లపల్లిలో దాదాపు రూ.13,500 కోట్లతో వైఎస్సార్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేసింది. పనులకు శ్రీకారం చుట్టాం.  


రూ.13 వేల కోట్లతో మూడు పోర్టులు

  • భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నంలో రూ.13 వేల కోట్లతో 2024 నాటికి మూడు గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేసేలా శ్రీకారం చుట్టాం. రామాయపట్నం, భావనపాడు పోర్టులకు ఇప్పటికే టెండర్లు పిలిచాం. మచిలీపట్నం పోర్టు కోసం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. 
  • ఇవి కాకుండా రూ.3,827 కోట్ల వ్యయంతో 2 దశల్లో 9 కొత్త ఫిషింగ్‌ హార్బర్లను అభివృద్ధి చేస్తున్నాం. మన వాళ్లు జీవనోపాధికోసం పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ సరిహద్దులకు వెళ్లి పట్టుబడితే.. వారిని తీసుకురావడం కోసం నానా అగచాట్లు పడుతున్న పరిస్థితుల్లో మనమే ఫిషింగ్‌ హార్బర్లను నిర్మించి, వారికి ఇక్కడే ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాం.
  • శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, గుంటూరు జిల్లా నిజాంపట్నం, ప్రకాశం జిల్లా వాడరేవు, కొత్తపట్నం, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, కృష్ణా జిల్లా మచిలీపట్నం.. ఈ 9 ప్రాంతాల్లో హార్బర్లను అభివృద్ధి చేస్తున్నాం. 
  • ఇప్పటికే నాలుగు హార్బర్ల కోసం టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టాం. మిగిలిన వాటి కోసం టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తున్నాం. వీటి ద్వారా 76,230 మంది మత్స్యకార సోదరులకు నేరుగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 2024 నాటికి పరోక్షంగా 35 వేల మందికి హార్బర్ల అనుబంధ పరిశ్రమల వల్ల ఉద్యోగాలు లభిస్తాయి.

ఆసరా, చేయూత ద్వారా ఉపాధి అవకాశాలు

  • గ్రామీణ స్థాయి నుంచి ఉపాధి అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో మనందరి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఆసరా, చేయూత పథకాల ద్వారా స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టాం. అమూల్, ఐటీసీ, హిందుస్థాన్‌ లీవర్, ఫ్రోక్టర్‌ అండ్‌ గాంబిల్, రిలయన్స్‌.. తదితర భారీ సంస్థలతో ఆయా పథకాల లబ్ధిదారులను టై అప్‌ చేశాం.
  • 1,07,232 మంది అక్కచెల్లెమ్మలకు కిరాణా దుకాణాలు, చిరు వ్యాపారాలు పెట్టించాం. 2,65,168 మంది అక్కచెల్లెమ్మలకు అమూల్‌ ద్వారా టై అప్‌ చేయించడమే కాకుండా ఆవులు, గేదెలు, గొర్రెల పెంపకం ద్వారా ఉపాధి కల్పించాం. మొత్తంగా 3,72,400 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఉపాధి చూపించాం. 

ఎన్నో కార్యక్రమాలు.. అందరికీ అండ

  • జగనన్న తోడు కార్యక్రమం ద్వారా 9.51 లక్షల మంది చిరు వ్యాపారులకు సున్నా వడ్డీకే రుణాలు ఇప్పించి, ఆ వడ్డీ సొమ్మును ప్రభుత్వమే కట్టేట్టుగా అమలు చేస్తున్నాం. ఇది కాక ఇంటివద్దకే రేషన్‌ కార్యక్రమంలో భాగంగా ఒక్కో వాహనం రూ.5.8 లక్షల వ్యయంతో 9,260 రేషన్‌ వాహనాలను 90% సబ్సిడీతో అందించాం.
  • దీనివల్ల ఒక్కో వాహనానికి ఇద్దరు చొప్పున 18,525 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాం. నా కుటుంబ సభ్యులైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ సోదరులే దాదాపు 80 శాతం మందికి మేలు జరుగుతోంది.
  • పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 2,500 కోట్లతో 25 సెకండరీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు  ఏర్పాటు చేయబోతున్నాం. త్వరలోనే వీటి పనులు ప్రారంభం అవుతాయి.
  • తద్వారా రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసే పంటకు వాల్యూ ఎడిషన్‌ క్రియేట్‌ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధికి ఒక వైపున సాధికారతనిస్తూ, మరో 30 వేల మందికి ప్రత్యక్షంగా, ఇంకో 50 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. 
  • ఆక్వా ఉత్పత్తుల స్థానిక వినియోగం పెంచేందుకు 23 ప్రీ ప్రాసెసింగ్‌ యూనిట్లు, 10 ప్రాససింగ్‌ యూనిట్లు నెలకొల్పుతున్నాం. వీటితోపాటు 100 హబ్స్‌ను, ప్రతి గ్రామానికీ మత్సు్య ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చేలా 14,500 రిటైల్‌ షాపులను ఏర్పాటు చేస్తున్నాం. వీటి ద్వారా ఆక్వా రంగంలో రూ.1,200 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. 1,01,500 మందికి ఉపాధి లభిస్తుంది.

జాతీయ ర్యాంకుల్లో మొదటి స్థానం
పారిశ్రామిక రంగంపై ర్యాంకింగ్‌లు ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వం, వరల్డ్‌ బ్యాంకు దేశంలో మొట్టమొదటి సారిగా పారిశ్రామిక వేత్తల నుంచి కూడా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని ర్యాంకింగ్‌లు ఇచ్చాయి. స్టేట్‌ బిజినెస్‌ రిఫార్మ్‌ యాక్షన్‌ ప్లాన్‌ రిపోర్టు జాతీయ ర్యాంకుల్లో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని చెప్పడానికి గర్వపడుతున్నాను. పారిశ్రామిక వేత్తలను ఎంతలా సపోర్టు చేస్తున్నామో.. కేంద్ర ప్రభుత్వం, వరల్డ్‌ బ్యాంకులు నేరుగా వారినే అడిగి దేశ వ్యాప్తంగా సర్వే చేపట్టి, ఈ ర్యాంకులను ప్రకటించాయి. ఇందులో ఏపీకి మొదటి స్థానం రావడం అనేది.. పారిశ్రామిక రంగానికి చెందిన వ్యక్తులు, పెట్టుబడిదారులు రాష్ట ప్రభుత్వం మీద ఉంచిన నమ్మకానికి, విశ్వసనీయతకు నిదర్శనం ఇది. పరిశ్రమలకు అండగా, వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలబడుతున్న మనందరి ప్రభుత్వానికి దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలందరి చల్లని దీవెనలు కూడా సదా ఉండాలని కోరుకుంటున్నాను.  

త్వరలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన

  • ఎయిర్‌ పోర్టుల అభివృద్ధిలో భాగంగా ఈ ఏడాది మార్చిలో కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయాన్ని మనందరి ప్రభుత్వం ప్రారంభించింది. రూ.3 వేల కోట్లతో భోగాపురంలో గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయాన్ని పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేస్తాం. 
  • దీనిపై కూడా గిట్టనివారు కొంత మంది కోర్టులో కేసులు వేశారు. వీటిని పరిష్కరించే ప్రయత్నం జరుగుతోంది. దేవుడి దయతో త్వరలోనే పరిష్కారం అయ్యి, అన్నీ బాగుంటే వచ్చే నెలలోనే దానికి శంకుస్థాపన చేద్దామని గట్టి నమ్మకంతో ఉన్నాం.  

నిజాయితీగా, చిత్తశుద్ధితో అడుగులు ముందుకు వేస్తున్నాం. తద్వారా పరిశ్రమలు పెట్టిన వారికే కాకుండా, అక్కడ పని చేస్తున్న వారికీ మంచి జరిగేలా మనసా, వాచా, కర్మణ ముందుకెళుతున్నాం. చంద్రబాబు హయాంలో 2015 నుంచి ఎంఎస్‌ఎంఈలకు పెట్టిన బకాయిలు రూ.904 కోట్లు, స్పిన్నింగ్‌ మిల్లుల బకాయిలు రూ.684 కోట్లు.. మొత్తంగా రూ.1,588 కోట్లు మనందరి ప్రభుత్వం చెల్లించింది. ఈ 27 నెలల కాలంలోనే ఎంఎస్‌ఎంఈలకు మనందరి ప్రభుత్వం అందించిన మొత్తం ప్రోత్సాహకాలు రూ.2,086 కోట్లు.     – సీఎం వైఎస్‌ జగన్‌ 

మరిన్ని వార్తలు