కోవిడ్‌ సంక్షోభంలో.. రైతు కష్టమే ఎక్కువ: సీఎం వైఎస్‌ జగన్‌

14 May, 2021 02:51 IST|Sakshi

వరుసగా మూడో ఏడాది రైతు భరోసా కింద నిధులు ఇస్తున్నాం

52.38 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.3,928 కోట్లు జమ 

ఇది రైతు పక్షపాత ప్రభుత్వం.. వారి కోసం ఎన్నో కార్యక్రమాలు

కోవిడ్‌ నిర్మూలనకు టీకానే పరిష్కారం..కానీ దేశంలో వ్యాక్సిన్‌ తగినంత ఉత్పత్తి కావడం లేదు

అందువల్ల కోవిడ్‌తో సహజీవనం చేస్తూనే ఎదుర్కోక తప్పదు

రైతులు తమ పని చేసుకుంటూ, కోవిడ్‌పై జాగ్రత్తలు తీసుకోవాలి

మాస్క్‌లు, భౌతికదూరం తప్పనిసరి 

23 నెలల కాలంలో రైతన్నల కోసం రూ.68 వేల కోట్లకు పైగా ఖర్చు 

రైతులు, పేద వర్గాల ఖాతాల్లోకి నేరుగా రూ.89 వేల కోట్లు జమ 

ఈ నెల 25న పంటల బీమా కింద 38 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.2000 కోట్లు జమ 

అందుకే ఆదాయం తగ్గినా రైతులకు ఇచ్చిన మాట నిలుపుకుంటున్నాం: సీఎం వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌ రైతు భరోసా చెక్కుతో సీఎం జగన్‌. చిత్రంలో మంత్రి కన్నబాబు, ఎంపీ బాలశౌరి, పలువురు రైతులు, ఉన్నతాధికారులు 

సాక్షి, అమరావతి: కోవిడ్‌ సంక్షోభంలో ప్రభుత్వ కష్టం కంటే రైతుల కష్టమే ఎక్కువ అని భావించానని, ఆదాయ వనరులు తగ్గినప్పటికీ రైతులకు ఇచ్చిన మాట మేరకు వరుసగా మూడో ఏడాది రైతు భరోసా కింద ఆయా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సాగులో రైతులు ఏ ఇబ్బంది పడకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని, వారి కోసం గత 23 నెలల్లో ఎన్నో కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు. రైతులకు పంట పెట్టుబడి సాయంగా వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ రైతు భరోసా కింద తొలి విడతగా 52.38 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.7,500 చొప్పున గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రూ.3,928 కోట్లు జమ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కేంద్రాల్లో రైతులు, అధికారులనుద్ధేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. కోవిడ్‌ సమూల నిర్మూలనకు వ్యాక్సినేషన్‌ ఒక్కటే పరిష్కారమని, కానీ దేశంలో తగినంత వ్యాక్సిన్‌ ఉత్పత్తి కావడం లేదన్నారు. అందువల్ల కోవిడ్‌తో సహజీవనం చేస్తూనే ఎదుర్కోక తప్పదని చెప్పారు. కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూ రైతులు తమ పని చేసుకుంటూ ముందుకు సాగాలని ఆయన సూచించారు. వాక్సినేషన్‌ పూర్తి అయ్యే వరకు ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించడం, చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  
 
23 నెలలు.. రూ.89 వేల కోట్లు
వినడానికి ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నప్పటికీ, ఈ 23 నెలల పాలనలో దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో దాదాపు రూ.89 వేల కోట్లు నేరుగా బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాము. ఎక్కడా వివక్ష లేకుండా, లంచాలకు తావు లేకుండా, పూర్తి పారదర్శకంగా, పక్కాగా సామాజిక తనిఖీలు చేసి, ఏ ఒక్క అర్హుడు మిస్‌ కాకుండా అందరికీ ప్రయోజనం కల్పించాం. ప్రతి పేద వాడికి సహాయం అందించే విధంగా అడుగులు ముందుకు వేశాము.

రైతు భరోసా కింద రూ.17,029 కోట్లు
మూడో ఏడాది తొలి విడతగా ఇవాళ అర కోటి మందికి పైగా రైతులకు రూ.3,928 కోట్లు వారి ఖాతాల్లో  వేస్తున్నాము. 2019–20 నుంచి ఇప్పటి వరకు ఒక్క రైతు భరోసా కింద రూ.13,101 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని రైతు బిడ్డగా, మీ బిడ్డగా గర్వంగా చెబుతున్నాను. ఇవాళ్టి మొత్తం కూడా కలుపుకుంటే ఒక్క రైతు భరోసా కింద రూ.17,029 కోట్లు ఇచ్చామని సగర్వంగా చెబుతున్నాను.

రైతన్నలకు రూ.68 వేల కోట్ల సాయం
– రైతు భరోసా కింద 52.38 లక్షల మంది రైతులకు రూ.17,029 కోట్లు ఇవ్వగలిగాము.
– వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల కింద, గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు కూడా కలుపుకుని 67.50 లక్షల మంది రైతులకు రూ.1,261 కోట్లు ఇచ్చాం.
– వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా కింద 15.67 లక్షల మంది రైతులకు ఇప్పటి వరకు రూ.1,968 కోట్లు ఇచ్చాం.
– ప్రకృతి వైపరీత్యాల కింద పంట నష్టపోయిన 13.56 లక్షల మంది రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.1038 కోట్లు ఇచ్చాం. 
– ధాన్యం కొనుగోలుకు రూ.18,343 కోట్లు ఖర్చు చేశాం. ఇతర పంటలు కూడా కొనుగోలు చేసి రైతన్నలకు తోడుగా నిలబడేందుకు రూ.4,761 కోట్లు ఖర్చు చేయగలిగాం.
– ఉచిత వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీ కింద రూ.17,430 కోట్లు ఖర్చు చేశాం.  రైతులకు పగటి పూట నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం ఫీడర్లపై రూ.1700 కోట్లు ఖర్చు చేశాం.
– గత ప్రభుత్వం వదిలి పెట్టిపోయిన ధాన్యం బకాయిలు రూ.960 కోట్లు మీ బిడ్డ తీర్చాడు. విత్తన సేకరణ బకాయిలు కూడా రూ.384 కోట్లు తీర్చాం.
– శనగ రైతులకు బోనస్‌ కింద దాదాపు రూ.300 కోట్లు ఖర్చు చేశాం.
– సూక్ష్మ సేద్యం, పండ్ల తోటల అభివృద్ధి కోసం 13.58 లక్షల ఎకరాలలో రూ.1,224 కోట్లు ఖర్చు చేశాం.
– ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్‌ కేవలం రూ.1.50కే ఇస్తూ, ఏటా దాదాపు రూ.760 కోట్ల భారం భరిస్తూ, ఈ రెండేళ్లలో దాదాపు రూ.1,560 ఖర్చు చేశాం. మొత్తంగా గత 23 నెలల్లో రూ.68 వేల కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా, మీ బిడ్డగా తెలియజేస్తున్నా. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి?

ప్రతి రైతుకూ ఈ పథకం ద్వారా మేలు
– దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు, అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులు, అటవీ హక్కు పత్రాలు (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) పొంది సాగు చేసుకుంటున్న గిరిజన రైతులు, దేవాలయాల భూములు సాగు చేస్తున్న రైతులకు కూడా వైఎస్సార్‌ రైతు భరోసా పథకం వర్తింప చేస్తున్నాం.
– రాష్ట్రంలో దాదాపు 50 శాతం రైతులకు అర హెక్టారు (1.25 ఎకరాలు) భూమి మాత్రమే ఉంది. అదే ఒక హెక్టారు (2.5 ఎకరాల) వరకు భూమి ఉన్న రైతులు దాదాపు 70 శాతం ఉన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా కింద ప్రభుత్వం చేస్తున్న రూ.13,500 సాయం, ఆ రైతులందరికీ దాదాపు 80 శాతం సరిపోతుంది.
– ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినా, అధికారంలోకి రాగానే రైతన్నల కష్టాలు చూసి, చెప్పిన దాని కన్నా ఒక ఏడాది ముందుగానే, ఇస్తామన్న దాని కన్నా మరో వెయ్యి రూపాయలు ఎక్కువగా రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.13,500 చొప్పున, అయిదేళ్లలో మొత్తం 67,500 రూపాయల చొప్పున సహాయం చేస్తున్నాము. ఆ విధంగా రైతన్నలకు రూ.17,500 అదనంగా ఇవ్వగలుగుతున్నాం.

ఈ నెలలోనే మరో రూ.2 వేల కోట్లు 
– వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా కింద ఈ నెల 25న దాదాపు 38 లక్షల మంది రైతులకు దాదాపు రూ.2 వేల కోట్లు అందించబోతున్నాం.
– 5 కోట్ల జనాభా ఉన్న మన రాష్ట్రంలో రైతులు, మహిళలు, పిల్లలు, ముఖ్యంగా పేద వర్గాలు.. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ 23 నెలల పరిపాలన సాగింది.

కోవిడ్‌తో యుద్ధం 
– ఇవాళ పరిస్థితి మీకు తెలుసు. ఒకవైపు కోవిడ్‌తో యుద్ధం చేస్తూ, మనందరం సామాన్య జీవితం గడపాల్సిన పరిస్థితి ఉంది. కోవిడ్‌ను సమూలంగా తీసేయాలి అంటే, వాక్సినేషన్‌ ఒక్కటే అని అందరికీ తెలుసు. కానీ మన దేశంలో వ్యాక్సినేషన్‌ పరిస్థితి ఏమిటన్నది కూడా అందరికీ తెలుసు.
– దేశంలో 45 ఏళ్ల పైబడిన వారు దాదాపు 26 కోట్లు ఉంటే, వారికి రెండు డోస్‌ల చొప్పున మొత్తం 52 కోట్ల డోస్‌లు ఇవ్వాలి. అదే విధంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వారు 60 కోట్లు ఉన్నారు. వారికి 120 కోట్ల డోస్‌లు కావాలి. వీరందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలంటే మొత్తం 172 కోట్ల డోస్‌లు కావాలి. కానీ ఇప్పటి వరకు కేవలం దాదాపు 18 కోట్ల డోసులు మాత్రమే వ్యాక్సిన్‌ ఇచ్చారు. అంటే దాదాపు 10 శాతం మాత్రమే ఇవ్వగలిగాం.
– రాష్ట్రంలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లతో సహా 45 ఏళ్లకు పైబడిన వారు దాదాపు 1.48 కోట్లు ఉన్నారు. వారందరికీ దాదాపు 3 కోట్ల డోస్‌లు కావాలి. అదే విధంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వారు మరో 2 కోట్లు. వారికి రెండు డోస్‌ల చొప్పున 4 కోట్ల డోస్‌లు కావాలి. ఆ విధంగా వీరందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలంటే దాదాపు 7 కోట్ల వ్యాక్సిన్లు కావాల్సి ఉండగా, మనకు కేంద్రం సరఫరా చేసింది కేవలం 73 లక్షల డోస్‌లు మాత్రమే. అంటే 10 శాతం కూడా మించని పరిస్థితి.
– ఎందుకు ఈ పరిస్థితి అంటే, దేశంలో కేవలం రెండు కంపెనీలు భారత్‌ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్‌ మాత్రమే వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయి. భారత్‌ బయోటెక్‌ నెలకు కోటి, సీరమ్‌ సంస్థ 6 కోట్లు.. రెండూ కలిపి నెలకు 7 కోట్ల వ్యాక్సిన్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. 
– కాబట్టి అందరికీ ఒకటే విజ్ఞప్తి. ఒకవైపు చేయాల్సిన పనులు చేస్తూనే, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్‌లు ధరించాలి. చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. భౌతిక దూరం పాటించాలి. ఇవన్నీ మన జీవితంలో భాగం కావాలి. ఆ విధంగా రైతులు తమ పని చేసుకుపోవాలి.
 
అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు 
కొన్ని విన్నప్పుడు అవి సాధ్యమవుతాయా? అనిపిస్తుంది. కానీ సీఎం జగన్, అలా సా«ధ్యం చేసి చూపారు. గత ముఖ్యమంత్రి రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మాట తప్పారు. కానీ మీరు మాత్రం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నారు. ఎవరైనా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాలని చూస్తారు. కానీ మీరు మాత్రం ఆ సంఖ్య క్రమంగా పెంచుతూ పోతున్నారు. ఈ ఏడాది యానాం రైతులకు కూడా పెట్టుబడి సాయం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ ఈ స్థాయిలో రైతులకు అండగా నిలుస్తున్నందుకు రైతాంగం తరఫున మీకు కృతజ్ఞతలు.
– కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి
 

ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాదాపు 52.38 లక్షల మంది రైతులకు రైతు భరోసా మూడో ఏడాదికి సంబంధించి మొదటి విడతగా రూ.3,928 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. దేవుడి దయతో మీ బిడ్డగా ఈ గొప్ప కార్యక్రమం చేయగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది.ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు 600 పేజీల మేనిఫెస్టో ప్రకటించడం, ఆ తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేయడం మనమంతా చూశాం. అలాంటి పరిస్థితి రాకూడదని, ఎన్నికలప్పుడు కేవలం రెండు పేజీల మేనిఫెస్టో ప్రకటించాం. దాన్ని భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావిస్తామని చెప్పాం. తూచ తప్పకుండా ఈ 23 నెలల కాలంలో అందులో 90 శాతానికి పైగా అమలు చేశామని సగర్వంగా తెలియజేస్తున్నా. -ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

తండ్రికి తగ్గ తనయుడు మీరు  
నాకు రెండెకరాలు సొంత పొలం ఉంది. మూడు ఎకరాలు కౌలుకు చేస్తున్నా. మూడు విడతల్లో నాకు రైతు భరోసా డబ్బులు అందుతున్నాయి. ఇందుకు 
మీకు ధన్యవాదాలు. గతంలో పంట షావుకార్లకు అమ్మాల్సి వచ్చేది. ఇప్పుడు ఆర్బీకేల వద్దే ధైర్యంగా అమ్ముకుంటున్నాం. నా ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మా ఊళ్లోనే అందుతున్నాయి. పంట నష్టపోతే పరిహారం ఇచ్చారు. వైఎస్సార్‌కు తగ్గ కుమారుడిగా మీరు అన్ని విధాలా ప్రజలను ఆదుకుంటున్నారు.  
– గోవిందరాజులు, జెడ్‌.భావారం, తూ.గో జిల్లా  
   

మరిన్ని వార్తలు