'అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించడమే లక్ష్యం’

27 May, 2021 17:31 IST|Sakshi

3 నుంచి 8 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారులపై ప్రత్యేక దృష్టి పెట్టండి

అందుకోసం టీచర్లను సమర్థవంతంగా వినియోగించుకోవాలి

ప్రీప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధన లక్ష్యాలుగా సరికొత్త ఆలోచనలు

దీంట్లో భాగంగానే ఫౌండేషన్‌ స్కూళ్లు

సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి,అమరావతి:  ప్రీప్రైమరీ ప్రైమరీ విద్యార్థులకు అత్యున్నత విద్యను అందించడంలో భాగంగా విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం క్యాంప్‌ కార్యాలయంలో  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు  పాల్గొన్నారు. సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..

అదే మా తపన, అదే మా ఆరాటం
''పిల్లల్లో 6 ఏళ్ల వయసులోపే 80 శాతం మేధో వికాసం చెందుతుంది. అందుకే ఈ ఆలోచన.. నిరుపేద విద్యార్థులకు కూడా అత్యుత్తమ ప్రమాణాలతో విద్య అందించాలని నా తపన, ఆరాటం. ఆ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినవే ఈ వైఎస్సార్‌ ప్రి ప్రైమరీ స్కూళ్లు.. ఫౌండేషన్‌ స్కూళ్లు. అన్ని వసతులతో విద్యార్థులకు మంచి చదువు అందించడమే లక్ష్యంగా మనబడి, నాడు–నేడు చేపట్టాము. కార్యక్రమంలో భాగంగా, స్కూళ్ల రూపురేఖలనే సమూలంగా మార్చేస్తున్నాము. అధికారులు ఇప్పుడు చేస్తున్న ప్రతిపాదనల వల్ల కాస్ట్‌ ఇంపార్ట్, ఎడ్యుకేషన్‌ ఇంపాక్ట్‌పె పరిశీలన చేయండి. ప్రతి మండలానికీ ఒక జూనియర్‌ కాలేజీ పెట్టాలనుకున్నాం. ఇది కాకుండా ప్రస్తుతం ఉన్న హైస్కూళ్లలో 11, 12 తరగతులను పెట్టడమా? లేక మండలానికి ఒక జూనియర్‌ కాలేజీని పెట్టాలా? అలాగే కొన్ని మండలాల్లో అవసరాల మేరకు 2 జూనియర్‌ కాలేజీలు పెట్టాలా? అన్నదానిపై పూర్తి స్థాయి పరిశీలన చేయండి. దీని తర్వాత తుది నిర్ణయం తీసుకుందాం. ఈ నిర్ణయం వల్ల 11, 12 తరగతులకు ప్రభుత్వ రంగంలోనే మంచి విద్య అందించే అవకాశం ఉంటుంది. 

పీపీ స్కూళ్లు–మ్యాపింగ్‌:
ఇక ఇప్పుడు ఏర్పాటు చేయదలచిన ఫౌండేషన్‌ స్కూళ్లు అన్నీ కూడా ఒక కిలోమీటర్‌ దూరం లోపల ఉండాలి. అలాగే అన్ని హైస్కూళ్లు (3 తరగతి నుంచి 10 లేదా 12వ తరగతి) 3 కిలోమీటర్ల దూరం లోపల ఉండాలి.వైఎస్సార్‌ ప్రిప్రైమరీ స్కూళ్లు పిల్లలకు చాలా దగ్గరగా అందుబాటులో ఉండాలి. ఆ విధంగా ఆ స్కూళ్ల మ్యాపింగ్‌ చేయాలి. టీచర్లలోని బోధనా సామర్థ్యాని మరింత వినియోగించుకునేలా తగిన హేతుబద్ధీకరణ చేపట్టాలి. తద్వారా పిల్లలకు ఇంకా అత్యుత్తమ విద్యను అందించవచ్చు. కొత్త ప్రతిపాదనల అమలు వల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతుందన్న దానిపై పూర్తిస్థాయిలో అధికారులు ఆలోచనలు చేసి.. తదుపరి సమీక్షలో నివేదించాలని సీఎం ఆదేశం. ఒకవేళ వాటిని అమలు చేయాల్సిన పక్షంలో ముందుగా 3, 4, 5 తరగతులను యూపీ స్కూళ్లకు, హైస్కూళ్లకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఖరారు అయిన తర్వాత ఫౌండేషన్‌ స్కూళ్లలో చేపట్టాల్సిన నాడు–నేడు కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి.  

డిజిటల్‌ టీచింగ్‌:
స్థానిక ప్రాథమిక పాఠశాలలో అంగన్‌ వాడీలు (పీపీ–1, పీపీ–2), 1, 2 తరగతుల ఫౌండేషన్‌ స్కూళ్ల ఏర్పాటు తర్వాత డిజిటల్‌ బోధన ప్రక్రియ (డిజిటల్‌ టీచింగ్‌)పై దృష్టి పెట్టండి. ఆ మేరకు డిజిటిల్‌ బోధనా పద్ధతులు (టీచింగ్‌ మెథడాలజీ) రూపొందించండి. మనం బ్లాక్‌ బోర్డు నుంచి గ్రీన్‌ బోర్డ్స్‌కు మారాం. ఇక ముందు డిజిటిల్‌ బోర్డ్స్‌కు వెళ్లే పరిస్థితి వస్తుంది. డిజిటల్‌ బోర్డుల డ్యూరబులిటీ (దీర్ఘకాలం పని సామర్థ్యం) ఉండేలా చూసుకోండి.మనం ఏర్పాటు చేసే పరికరం ఒక రోబస్ట్‌గా ఉండాలి. మరమ్మతులకు అవకాశం తక్కువగా ఉండే డివైజ్‌లను గుర్తించండి. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పరిశీలన చేయండి.ఎన్ని స్కూళ్లలో, ఎన్ని క్లాస్‌రూమ్‌లలో ఏర్పాటు చేయగలం? ఎంత వ్యయం అవుతుంది? అన్నవాటిని సమీక్షించాలి.'' అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు