పోలవరం మరింత వేగంగా: సీఎం జగన్‌

2 Mar, 2021 03:09 IST|Sakshi

యుద్ధప్రాతిపదికన పోలవరం పనులు పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం

2022 మే చివరికి కాఫర్‌ డ్యాం పనులు పూర్తి 

ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు అవకాశమే లేదు.. ఇదే విషయాన్ని సీడబ్ల్యూసీ విస్పష్టంగా చెప్పింది

నిర్దేశిత ఎత్తుకు తగ్గట్టుగా షట్టర్లు బిగిస్తున్నాం

కొన్ని పత్రికల్లో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదు

గత సర్కారు హయాంలో అక్కడక్కడా అరకొర పనులతో స్పిల్‌ చానల్‌కు ఇబ్బందులు 

సమీక్షలో అధికారుల వెల్లడి

ప్రకృతి సమతుల్యత పెంపొందించేలా ప్రాజెక్టు వద్ద ‘వైఎస్సార్‌ గార్డెన్స్‌’

రాష్ట్రానికి మేలు జరిగేలా నదుల అనుసంధానం ప్రతిపాదనల తయారీ

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌ చానల్, అప్రోచ్‌ చానల్‌ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అవి పూర్తయ్యేలోగా కాఫర్‌ డ్యాంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. దీనివల్ల వచ్చే వర్షాకాలంలో వరద నీటిని స్పిల్‌ వే మీదుగా పంపే అవకాశం ఉంటుందన్నారు. పోలవరంలో స్పిల్‌వే, అప్రోచ్‌ చానల్, అప్‌ స్ట్రీం కాఫర్‌ డ్యాం, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం, గేట్ల అమరిక తదితర కీలక పనులపై సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం నిర్మాణంలో గత సర్కారు తప్పిదాల వల్ల పనుల్లో ఇబ్బందులు ఏర్పడిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.

స్పిల్‌ వే పూర్తికాకుండా కాఫర్‌ డ్యాం నిర్మాణం చేపట్టడం వల్ల ఇబ్బందులు ఏర్పడినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఒక పద్థతి ప్రకారం కాకుండా అక్కడక్కడా అరకొరగా పనులు చేసి వదిలిపెట్టారని, వరదల సమయంలో స్పిల్‌ చానల్‌ పనులకూ తీవ్ర ఆటంకం కలిగిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గతంలో కాఫర్‌ డ్యాంలో వదిలిన ఖాళీల కారణంగా వరదల సమయంలో సెకనుకు సుమారు 13 మీటర్లు వేగంతో వరద ప్రవాహం వచ్చిందని, దీనివల్ల ఈసీఆర్‌ఎఫ్‌డ్యాం వద్ద గ్యాప్‌  – 1, గ్యాప్‌ – 2లలో భారీ ఎత్తున కోతకు గురైందన్నారు. ఇప్పుడు ఈ పనులన్నింటిపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు తెలిపారు. ఇప్పటికే స్పిల్‌వే పనులు పూర్తయ్యాయని... గేట్లు, సిలిండర్ల బిగింపు పనులు చురుగ్గా సాగుతున్నాయని, 2022 మే నెలాఖరు నాటికి కాపర్‌ డ్యాం పనులను పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పోలవరం సహాయ, పునరావాస కార్యక్రమాలపైనా సీఎం సమీక్షించారు.
పోలవరం ప్రాజెక్టు పనులపై జరిగిన సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ తదితరులు 

ఎత్తు తగ్గింపు అవకాశమే లేదు..
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు అవకాశమే లేదని, తొలుత నిర్దేశించిన ఎత్తుకు తగినట్లుగానే ఇప్పటికే షట్టర్లు బిగిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ కొన్ని పత్రికల్లో (‘సాక్షి’లో కాదు) వెలువడ్డ కథనాలను అధికారులు కొట్టి పారేశారు. పోలవరం ఎత్తు తగ్గింపు అవకాశమే లేదని, ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సైతం స్పష్టం చేసిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎత్తు తగ్గింపుపై ఇప్పుడు చర్చలు, ప్రతిపాదనలు అసంబద్ధమంటూ సీడబ్ల్యూసీ, కేంద్ర జలశక్తి శాఖ ఇప్పటికే విస్పష్టంగా చెప్పినా కొన్ని పత్రికలు పనికట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నాయనే అంశం సమావేశంలో చర్చకు వచ్చింది.

రాష్ట్రానికి మేలు జరిగేలా అనుసంధానం... 
రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేలా నదుల అనుసంధానంపై ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదుల అనుసంధానం ప్రతిపాదనల నేపథ్యంలో సీఎం సమీక్ష నిర్వహించారు. నదుల అనుసంధానం వల్ల రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేలా ప్రతిపాదనలు ఉండాలన్నారు. అయోమయం, సందిగ్ధతలకు తావులేకుండా ఉభయ తారకంగా ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్రం తరఫు నుంచి ప్రతిపాదనలు సిద్ధం కాగానే కేంద్రానికి పంపుదామని చెప్పారు.

ప్రకృతి సమతుల్యతతో వైఎస్సార్‌ గార్డెన్స్‌..  
పోలవరం వద్ద నిర్మించ తలపెట్టిన వైఎస్సార్‌ గార్డెన్స్‌ పనుల వల్ల పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రకృతి సమతుల్యతను మరింత పెంచేలా నిర్మాణ రీతి ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. పోలవరం వద్ద వైఎస్సార్‌ గార్డెన్స్‌ నిర్మాణంపై సమీక్ష సందర్భంగా అధికారులు మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిపాదనలను సీఎంకు వివరించారు. పోలవరం వద్ద జి– హిల్‌సైట్‌పై 100 అడుగుల ఎత్తుతో  వైఎస్సార్‌ విగ్రహాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. కాలం గడుస్తున్న కొద్దీ ఆహ్లాదం, అందం పెరిగేలా వైఎస్సార్‌ గార్డెన్స్‌ నిర్మాణ రీతులు ఉండాలని, నిర్వహణ వ్యయం కనిష్టంగా ఉండే విధంగా డిజైన్లు రూపొందించాలని సీఎం సూచించారు. పోలవరం ప్రాజెక్టు దిగువన బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఈ బ్రిడ్జి నుంచి జి– హిల్‌ను అనుసంధానిస్తూ రోడ్డు నిర్మాణ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. సమీక్షలో సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, జలవనరులశాఖ కార్యదర్శి జే.శ్యామలరావు, ఈఎన్‌సీ సి. నారాయణరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు