సాక్షి, అమరావతి: గ్రామం యూనిట్గా కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనివల్ల క్రమబద్ధంగా, ప్రాధాన్యత పరంగా వ్యాక్సినేషన్కు అవకాశం ఉంటుందని, వృథా కాకుండా మరింత సమర్థంగా అరికట్టవచ్చని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులతో సహా పాఠశాలల్లో పని చేస్తున్న సిబ్బందికి వ్యాక్సినేషన్లో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
18 – 44 ఏళ్ల వయసు వారికి కూడా వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉన్నందున సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ప్రజా బాహుళ్యంతో ఎక్కువగా సంబంధాలు ఉన్నవారు, ఉద్యోగులు, సిబ్బందికి వ్యాక్సినేషన్లో అధిక ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్, థర్డ్వేవ్ సన్నద్ధతపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
శాస్త్రీయ విశ్లేషణ చేపట్టాలి..
వ్యాక్సిన్లు, అనంతర పరిస్థితులపై శాస్త్రీయంగా విశ్లేషణ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. టీకాలు తీసుకున్నవారిపై వైరస్ ప్రభావం, కొంతమందికి వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత కూడా వైరస్ సోకడం తదితర అంశాలపై శాస్త్రీయ విశ్లేషణ జరపాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులను కూడా అధ్యయనం చేయాలని, దీనివల్ల కోవిడ్ నివారణకు మరింత పటిష్ట చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.
థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు సన్నద్ధం
థర్డ్ వేవ్ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉన్నట్లు సమీక్షలో అధికారులు తెలిపారు. సరిపడా మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు.
టీచర్లకు తొలిడోస్ 100 % పూర్తి
రాష్ట్రంలో ఈ నెల 16వ తేదీ నుంచి పాఠశాలలను తెరవనున్న నేపథ్యంలో 44 ఏళ్ల లోపు టీచర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రాధాన్యతగా కొనసాగుతోంది. 44 ఏళ్ల లోపు వారు 1,97,026 మంది టీచర్ల వివరాలు రిజిస్టర్ కాగా మొత్తం అందరికీ తొలి డోస్ వ్యాక్సినేషన్ పూర్తయింది. మరోవైపు రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన 1.15 కోట్ల మందికి పైగా టీకాలు ఇచ్చారు. ఈ నెల 10వతేదీ వరకు ప్రాధాన్యతల వారీగా వ్యాక్సినేషన్ వివరాలు ఇవీ..