సాక్షి, విజయనగరం: వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై తమకున్న అభిమానాన్ని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, వైఎస్సార్సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు దంపతులు మరోసారి చాటుకున్నారు. ఆ దంపతులకు తొలి సంతానంగా జన్మించిన పాపకు వైఎస్ అక్షరాలతో పాటు సీఎం జగన్, ఆయన సతీమణి భారతి పేరు కలిసొచ్చేలా ‘యశ్విత శ్రీజగతి’ అని నామకరణం చేశారు.
విజయనగరం జిల్లా చినమేరంగిలోని స్వగృహంలో శనివారం నిర్వహించిన నామకరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన, మంత్రి బొత్స తదితరులు హాజరయ్యారు. తమ కుమార్తెకు యశ్వితలో మొదటి అక్షరం వై, శ్రీలో మొదటి అక్షరం ఎస్ కలిపితే వైఎస్ అని, తమ నాయకుడు జగన్, ఆయన సతీమణి భారతి పేరు కలిపి జగతి అని నామకరణం చేశామని పుష్పశ్రీవాణి దంపతులు వివరించారు.