కల్తీకి కళ్లెం... అన్నదాతలకు అండగా వైఎస్సార్‌ అగ్రిటెస్టింగ్‌ ల్యాబ్స్‌

2 Feb, 2023 14:33 IST|Sakshi

నాణ్యతపై రైతన్నలకు భరోసా  

వ్యవసాయ ఉత్పత్తుల ప్రమాణాలే లక్ష్యంగా అడుగులు

రైతులకు సరఫరా చేసే, ఎరువులు, విత్తనాలకు పరీక్ష తప్పనిసరి

కడప అగ్రికల్చర్‌:  విత్తు బాగుంటే పంట బాగుంటుంది. పంట బాగుంటే నాణ్యమైన దిగుబడులు వస్తాయి. నాణ్యమైన దిగుబడులు వస్తే ధరలు బాగుంటాయి. ఇవన్నీ బాగుంటే రైతు సుభిక్షంగా ఉంటాడు. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. రైతులకు అతి ముఖ్యంగా అవసరమైన విత్తనాలతోపాటు ఎరువులు, పురుగుమందుల నాణ్యతను కాపాడితే రైతు అన్ని రకాల అభివృద్ధి చెందుతాడనే లక్ష్యంతో వైఎస్సార్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి అన్నదాతకు అండగా నిలుస్తోంది. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి కాలు కదపకుండా ఉన్న ఊర్లోనే రైతులకు కావాల్సిన అన్ని రకాల సేవలను అందిస్తోంది. దీంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.  

వ్యవసాయం పండుగ చేయడమే లక్ష్యంగా...  
వ్యవసాయాన్ని పండుగ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు రకాల పథకాలను చేపట్టింది. ఇందులో భాగంగా దేశంలో తొలిసారిగా ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభించేలా వైఎస్సార్‌ అగ్రిల్యాబ్‌లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున అగ్రిల్యాబ్‌ను ఏర్పాటు చేసి రైతులకు సేవలందించనున్నారు. ఇందులో భాగంగా మైదుకూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, బద్వేల్, కమలాపురంలలో ల్యాబ్‌లను ఏర్పాటు చేసి ఎరువులు, విత్తనాల పరీక్షలను నిర్వహిస్తూ  సేవలను ప్రారంభించారు. ముద్దనూరులో మాత్రం ల్యాబ్‌ బిల్డింగ్‌ పనులను పూర్తి చేసింది. త్వరలో దీనిని ప్రారంభించి సేవలందించనున్నారు. అలాగే కడపలో ఏర్పాటు చేసే డిస్ట్రిక్‌ ల్యాబ్‌కు సంబంధించిన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలో దీనిని కూడా ప్రారంభించనున్నారు. జిల్లా ల్యాబ్‌ ప్రారంభమైతే ఎరువులు, విత్తనాలతోపాటు పురుగు మందులను కూడా పరీక్షించనున్నారు.  

ధైర్యంగా సాగు చేపట్టేలా..  
మార్కెట్‌లోకి వచ్చే ప్రతి ఇన్‌పుట్‌ శ్యాంపిల్‌ను ఇక్కడ పరీక్షించుకునే వెసులుబాటు ఉండటంతో రైతుల్లో సాగుపై మరింత విశ్వాసం పెరిగింది. గతంలో నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు వాడి ఎంతో మంది రైతులు ఆర్థికంగా నష్టపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. రైతులు సొంతంగా తయారు చేసుకున్న విత్తనమైనా లేదా మార్కెట్‌లో కొనుగోలు చేసిన విత్తనమైనా నేరుగా ఈ ల్యాబ్‌కు వెళ్లి విత్తన నాణ్యతలను ఉచితంగా పరీక్షించుకోవచ్చు. విత్తనమే కాకుండా ఎరువులు, పురుగుమందుల నాణ్యతను కూడా పరీక్షించుకోవచ్చు.  

మూడు వితదల్లో పరీక్షలు... 
నకిలీలు, నాసిరకాలు నిరోధించి అర్హత లేని వ్యాపారుల నుంచి కాపాడేందుకు అగ్రి ల్యాబ్‌లు ఎంతగానో ఉçపయోగపడుతున్నాయి. ఈ ల్యాబుల్లో మూడు దశల్లో విత్తనాలు, పురుగుమందులు, ఎరువులను పరీక్షిస్తారు. ఆ తరువాత మార్కెట్‌లోకి విడుదల చేస్తారు. మార్కెట్‌లోకి విడుదలైన వాటిని జిల్లాస్థాయి ఇంటిగ్రేటెడ్‌æ ల్యాబుల్లో అన్ని పరీక్షలను నిర్వహించి నాణ్యత సంతృప్తికరంగా ఉంటే సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. నాణ్యత లోపించిన వాటిపై రైతులు కోర్టులో కేసులు వేసేందుకు ఈ సర్టిఫికెట్లు ఉపయోగపడతాయి.  

నాలుగు రకాల నమూనా పరీక్షలు..  
వైఎస్సార్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లలో రసాయనిక ఎరువులు, విత్తనాలకు సంబంధించి నాలుగు రకాల పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో మొదటి యాక్ట్‌ శాంపిల్‌ రాష్ట్ర స్థాయిలో సేకరించి పంపుతారు. వీటిని పరీక్షించి నివేదికలు రాష్ట్రస్థాయి అధికారులకు పంపుతారు.   

రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానం... 
నియోజకవర్గ స్థాయిలో ల్యాబ్‌లలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, పురుగు మందులు తదితర వాటి నమూనాలను ఎలాంటి రుసుం లేకుండా ల్యాబ్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ ద్వారా పరీక్షలు నిర్వహించి ధ్రువీకరిస్తారు. ఆర్‌బీకేల ద్వారా రాయితీపై అందజేసే వాటిని కూడా క్షుణ్ణంగా పరీక్షించి అన్నీ çసవ్యంగా ఉన్నాయంటేనే మార్కెట్‌లోకి విడుదల చేసి రైతులకు అందజేస్తారు. ల్యాబ్‌లో విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి జాతీయ ఇన్‌స్టిట్యూట్‌ల ద్వారా అత్యాధునిక శిక్షణ ఇచ్చారు. ఇంటిగ్రేటెñడ్‌ ల్యాబ్స్‌ను దగ్గరలోని రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానం చేశారు. ఇన్‌పుట్స్‌ పరీక్షించుకునేలా ఆర్‌బీకే సిబ్బంది క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తూ పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహిస్తున్నారు.    

మరిన్ని వార్తలు