AP MPP Elections 2022: ఐదు ఎంపీపీ స్థానాలు వైఎస్సార్‌సీపీకే..

6 May, 2022 04:09 IST|Sakshi

ఐదు చోట్ల ఎన్నికలు జరగ్గా.. అన్నీ కైవసం 

దుగ్గిరాల ఎన్నికల్లో ఉమ్మడిగా పాల్గొన్న టీడీపీ, జనసేన

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 5 చోట్ల ఎంపీపీ స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించగా.. ఐదు చోట్లా వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 15 మండలాల పరిధిలో 6 ఎంపీపీ, 11 ఉపాధ్యక్ష, మూడు కో–ఆప్షన్‌ సభ్యుల ఎంపికకు ఎన్నిక నిర్వహించారు. అయితే చిత్తూరు జిల్లా రామకుప్పం ఎంపీపీ ఎన్నికకు సభ్యులు ఎవ్వరూ హాజరు కాలేదు. దీంతో ఇక్కడ మరోసారి ఎన్నిక వాయిదా పడింది. 11 ఉపాధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉండగా 8 చోట్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. వీటిలో ఐదు స్థానాలను వైఎస్సార్‌సీపీ, రెండు టీడీపీ, ఒకటి జనసేన కైవసం చేసుకున్నాయి. 

గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎన్నికలో జనసేన, టీడీపీ ఉమ్మడిగా పాల్గొన్నాయి. పరస్పర మద్దతుతో చెరో ఉపాధ్యక్ష స్థానాన్ని చేజిక్కించుకున్నారు. అయితే ఈ ఇద్దరు అభ్యర్థులు సకాలంలో బీ–ఫామ్‌ సమర్పించలేదు. పల్నాడు జిల్లా నరసరావుపేట, అన్నమయ్య జిల్లా కలికిరి, చిత్తూరు జిల్లా రామకుప్పంలలో ఉపాధ్యక్ష ఎన్నికలు వాయిదా పడ్డాయి. కో–ఆప్షన్‌ ఎన్నికలు మూడు చోట్ల నిర్వహించారు. 41 పంచాయతీల్లో ఉప సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించగా 13 చోట్ల వాయిదా పడ్డాయి. 

మరిన్ని వార్తలు