ప్రకటించిన కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ జల అవార్డుల్లో ఉత్తమ జిల్లాగా ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ జిల్లా నిలిచింది. సౌత్ జోన్ పరిధిలో ఉత్తమ జిల్లా కేటగిరీలో రెండో స్థానం సాధించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ జాతీయ జల అవార్డులు–2020ను ప్రకటించారు. ఇందులో ఉత్తమ రాష్ట్ర విభాగంలో ఉత్తరప్రదేశ్కు ప్రథమ బహుమతి లభించగా, ఆ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలు నిలిచాయి. ఈ సందర్భంగా షెకావత్ మాట్లాడుతూ ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా 18 శాతం కంటే ఎక్కువగా ఉండగా, పునరుత్పాదక నీటి వనరుల్లో మాత్రం కేవలం నాలుగు శాతమే ఉందన్నారు.
ఈ నేపథ్యంలోనే ‘జల్ సమృద్ధ్ భారత్’ సాధనలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన ఆదర్శప్రాయమైన పనులు, ప్రయత్నాలను గుర్తించి ప్రోత్సహించేందుకు జాతీయ జల అవార్డులను ప్రధానం చేస్తున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ఉపరితల జలాలు, భూగర్భ జలాలు జల చక్రంలో అంతర్భాగంగా ఉన్నాయన్న వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటూ నీటి వనరుల నిర్వహణలో సమగ్ర విధానాన్ని అవలంబించేలా ఏకీకృత జాతీయ జల అవార్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి చెప్పారు.